తాండూరు, జూలై 20: ముసురుతో మొదలైన వాన రెండు రోజులుగా తెరిపినివ్వడం లేదు. తాండూరు నియోజకవర్గంలో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురవ డంతో కాగ్నా, కాక్రవేణి నదుల్లో జలసవ్వడి కనిపించింది. వాగులు, చెక్డ్యాంలు, చెరువులు, కుంటలు నీళ్లతో పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల పంటపొలాల్లోకి వరదనీళ్లు చేరడంతో పంటలు మునిగి పోయాయి. తాండూరు పట్టణంలో చిలుక వాగు కబ్జాకు గురై నిర్మాణాలు చేయడంతో ఆదర్శతులసీనగర్, మిత్రానగర్, గ్రీన్సిటీ కాలనీల్లో వరదనీరు ఇండ్లలోకి వచ్చాయి. కోకట్ వాగు, గాజీపూర్ వాగు రోడ్డుపై నుంచి పారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. స్థానిక నేతలు, అధికా రులు లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలుపడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికా రులు, ప్రజా ప్రతినిధులు సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పరిగి: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో ఎంపీపీ అరవిందరావు, ఎంపీడీవో శేషగిరిశర్మలు పర్యటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. పాడుబడిన ఇండ్లల్లో నివాసముండరాదని చెప్పారు. వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ స్తంభాలు తాకవద్దని చెప్పారు. ఇనుప స్తంభాలు ఉన్నచోట ముందు జాగ్రత్తగా షాక్ రాకుండా సరిచేయాలని విద్యుత్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి కొండలపై నుంచి…
వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి నుంచి గెరిగెట్పల్లి వెళ్లే రోడ్డు రైల్వే బ్రిడ్జి కింద వాగు ఉధృతంగా పారుతున్నది. శివారెడ్డిపేట వాగు పారడంతో ధన్నారం వెళ్లే రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. అనంతగిరి కొండలపై నుంచి వర్షపు నీరు పారుతున్నది. రహదారులపై నీరు ఉధృతంగా పారడంతో ప్రమాదాలు జరుగకుండా పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు తగు చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. గురువారం, శుక్రవారం విద్యాసంస్థలకు ప్రభుత్వం బంద్ను ప్రకటించడంతో చిన్న పిల్లలు ఇంటి వద్దే ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మున్సిపల్ కమిషనర్ పర్యటన
కొడంగల్: మండలంలోని ఖాజాఅహ్మద్ పల్లి గ్రామం మధ్యలోని చిట్లపల్లి వాగు ఉరకలేస్తుండడంతో గ్రామానికి ఈ దారిగుండా రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో ఈ గ్రామస్తులు అంగడిరైచూర్ మీదుగా అన్నారం గ్రామం నుంచి గ్రామానికి వెళుతున్నారు. అదేవిధంగా పోచమ్మతండా మధ్యలోని వాగులో వరద నీరు ఉధృతంగా పారుతున్నది. కొడంగల్ పెద్ద చెరువుకు నీరు చేరే కట్టుకాలువలో వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. కట్టుకాలువపై వంతెన నిర్మాణం చేపట్టడంతో చెరువులోకి నీరు వెళుతున్నప్పటికీ కొత్తగా నిర్మాణం చేపట్టిన వంతెన కావడంతో నీటి ఉధృతికి పక్కన వేసిన మట్టి కొట్టుకుపోయి తెగిపొతుంది. మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి కట్టుకాలువని పరిశీలించి తగు చర్యలు తీసుకొంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులను సందర్శించారు. శిథిలావస్థలకు చేరుకున్న ఇండ్లలో ప్రజలు నివసించరాదని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ఇండ్ల మధ్యన ఉండే కరెంటు స్థంబాలను చిన్నారులు తకకుండా తగు జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు, సలహాలను అందించారు.
అలుగు పారుతున్న చిన్నవాగు ప్రాజెక్టు
బొంరాస్పేట: బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో బుధ, గురువారాల్లో భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. గురువారం రోజంతా వర్షం కురవడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేకపోయారు. బొంరాస్పేట మండలంలో బుధవారం 17.4 మిల్లీ మీటర్లు, గురువారం 13.5 మిల్లీ వర్షపాతం నమోదుకాగా దుద్యాల మండలంలో బుధవారం 22.8 మిల్లీ మీటర్లు, గురువారం 29.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బొంరాస్పేట మండలంలోని బురాన్పూర్ చిన్నవాగు ప్రాజెక్టు నిండి అలుగు పారుతున్నది. బొంరాస్పేట, దుద్యాల మండలాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. మండలంలోని నాందార్పూర్ గ్రామంలో కుంటి ఎల్లప్పకు చెందిన ఇల్లు పాక్షికంగా కూలిపోయింది. ఆర్ఐ రవిచారి ఇంటిని పరిశీలించారు.
తాండూరు-కరణ్కోట రాకపోకలు బంద్
తాండూరు రూరల్: తాండూరు మండలంలోని వాగులు, వంకలు, కాగ్నా వాగు, బెల్కటూర్ వాగులు పొంగిపొర్లుతున్నాయి. తాండూరు – కరణ్కోట మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అదేవిధంగా వీర్శెట్టిపల్లి, గొనూర్, నారాయణపూర్ సమీపంలోని కాగ్నా వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నది. మండలంలోని అల్లాపూర్, జినుగుర్తి ప్రాజెక్టుల్లోకి భారీగా వర్షం నీరు చేరింది. దాంతోపాటు చిన్నచిన్న కుంటలు, చెరువుల్లోకి కూడా వర్షం నీరు చేరింది. ఓగిపూర్, మల్కాపూర్, కరణ్కోట, కోటబాసుపల్లి గ్రామాల పరిధిలోని నాపరాతి గనులు మునిగిపోయాయి.
ఉరకలేస్తున్న నస్కల్వాగు..
పరిగి టౌన్: పరిగి నుంచి నస్కల్ వెళ్లే దారిలో పెద్దవాగు వరదనీరుతో పొంగి పొర్లుతున్నదిఈ దారిలో వచ్చేవారు మన్నేగూడ మీదుగా పరిగికి రావాలని పోలీసులు సూచిస్తున్నారు. వరద ప్రవాహం గంటగంటకు ఎక్కువ అవుతుండటంతో వాగుపై నుంచి వరదనీరు పొంగిపొర్లుతున్నది. ఇదేవిధంగా రాత్రి వరకు వర్షం కురిస్తే లఖ్నాపూర్ ప్రాజెక్టు అలుగుపారే అవకాశం ఉంది. నస్కల్ వాగుపై వరదనీటికి కొట్టుకొచ్చిన ముళ్లకంపలను జేసీబీ సహాయంతో పోలీసులు తొలగించారు. వాగుసమీపంలో హెచ్చరికబోర్డులు పెట్టారు.
పునరావాస కేంద్రాలకు బాధితులు..
పెద్దేముల్: మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది.గాజీపూర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాండూరు-సంగారెడ్డి ప్రధాన రహదారి రోడ్డు మార్గంలో చాలా సేపు రాకపోకలు స్తంభించాయి. ప్రయాణికులు వేరే దారుల్లో తమ గమ్యస్థానాలకు చేరారు. కాగా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలోప్రజలు శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివసించరాదని మండల ఎంపీడీవో లక్ష్మప్ప సూచిం చారు. మండల పరిధిలోని జనగాం, కందనెల్లి, మంబాపూర్ గ్రామా ల్లో కురిసిన వర్షానికి పాక్షికంగా కూలిన, శిథిలావస్థకు చేరిన ఇండ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.ఈ మేరకు శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు…
ధారూరు: దోర్నాల్-ధారూరు స్టేషన్ (కాగ్నా) వాగు పొంగి పొర్లుతున్నది. దీంతో దోర్నాల్- ధారూరు స్టేషన్ మధ్య ఉన్న తాత్కాలిక వంతెన దెబ్బతిన్నది. పలు గ్రా మాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధారూరులో ఇల్లు కూలిపోయింది.
మోమిన్పేట: మండల కేంద్రంలోని నందివాగు ప్రాజెక్టును, ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్ద వాగును, కేసారం గ్రామంలో వర్షానికి కూలిపోయిన ఇండ్లను తహసీల్దార్ కిరణ్ కుమార్ పరిశీలించారు.
బంట్వారం: మండలంలోని సుల్తాన్పూర్, నూరుళ్లపూర్ వాగు, సల్బత్తాపూర్, రొంపల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపో కలు పూర్తిగా స్తంభించాయి. నూరుళ్లపూర్ నిరంతరంగా ప్రవహిస్తుండడం వల్ల యాచారం, మాలసోమార, సుల్తాన్పూర్ గ్రామాలతో పాటు, వికారాబాద్ ప్రాంతాల నుంచి ఈ దారిన వచ్చే వారు రాలేకపోయారు. ఈ వాగు వద్ద స్థానిక పోలీసులు భద్రతా చర్యలను తీసుకుంటున్నారు.
కోట్పల్లి: మండలంలోని కంకణాలపల్లి- మల్శేట్పల్లి తండా మధ్యనున్న వాగు, మోత్కుపల్లి, జిన్నారం, నాససాన్పల్లి, ఎన్నారం వాగులు ఉధృతంగా పారుతున్నా యి. ఎంపీడీవో లక్ష్మీనారాయణ, తహసీల్దారు అశ్పక్స్రూల్ కంకణాలపల్లి, మో త్కు పల్లి, నాగసాన్పల్లి వాగులను సందర్శించి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకునేలా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు.
దోమ: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీవో సోమలింగం, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి మండల ప్రజలను కోరారు. దోమ గ్రామ పంచాయితీ పరిధిలో సర్పంచ్ రాజిరెడ్డితో కలిసి ఎంపీవో శిథిలావస్థలో ఉన్న ఇండ్ల యజమానులతో మాట్లాడి పలు సూచనలు సలహాలు చేశారు.
నవాబుపేట: డీఎల్పీవో అనిత పుల్మామిడి గ్రామాన్ని సందర్శించారు. కమ్మెట శివరాజమ్మ ఇల్లు కూలిపోగా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇల్లు ఖాళీచేసి వేరే అనువైన నివాసాన్ని చూసుకోవాలని అందుకు గ్రామస్తులు కూడా సహకారం అందించాలని సూచించారు.