తాండూరురూరల్, ఫిబ్రవరి 24 : ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. తాండూరు మండలం, గుంతబాసుపల్లి గ్రామ శివారులోని ఇండోస్ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు యాసిడ్తో నిండిన ఓ డ్రమ్ము పగలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీలో ఉన్న మిగితా ఆయిల్కు మంటలు అంటున్నాయి. భారీగా అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు హుటాహుటిన ఫ్యాక్టరీ బయటికి పరుగులు తీశారు. దీంతో ప్రాణనష్టం జరుగలేదు. ఈ ఫ్యాక్టరీకి హైదరాబాద్, పటాన్చెరు, సంగారెడ్డి చుట్టు పక్కల ఉండే ఫార్మా కంపెనీల నుంచి వెలువడే రసాయన వ్యార్థాల(హిందూస్)ను ట్యాంకర్ల ద్వారా ఇక్కడికి తరలిస్తారు. ఈ వ్యార్థాలను బాగా మరిగించి సిమెంట్ కంపెనీలకు తరలిస్తారు. కర్ణాటకలోని చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీతోపాటు సేడం, కలబురిగిలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తారు.
కెమికల్ ఫ్యాక్టరీలో ఎగిసి పడుతున్న మంటలను అగ్నిమాపక శాఖ సిబ్బంది, హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అదుపులోకి తెచ్చారు.
ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడి దుర్వాసన రావడంతో గుంతబాసుపల్లి, మిట్టబాసుపల్లి, కరణ్కోట గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ వాయు కాలుష్యానికి కారణమైన ఈ ఫ్యాక్టరీని మూసి వేయాలని గతంలో గుంతబాసుపల్లి గ్రామస్తులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.