రంగారెడ్డి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : వివిధ వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలను మెండుగా కల్పించి ఆదాయ వనరుల పెంపే లక్ష్యంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకులు ఇతోధికంగా బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలను అందజేస్తున్నాయి. వివిధ యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గత పదేండ్ల కాలంలో రూ.4,298కోట్లను అందజేశారు. రుణాలతో మహిళలు వివిధ రకాల యూనిట్లను ఏర్పాటు చేసుకుని స్వయం సమృద్ధిని సాధిస్తున్నారు. ఈ ఏడాది బ్యాంకు లింకేజీ లక్ష్యం రూ.710 కోట్లు కాగా.. ఫిబ్రవరి 15 నాటికే లక్ష్యానికి మించి రూ.715కోట్లను అందజేశారు.
నాలుగో స్థానంలో జిల్లా..
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో జిల్లాలో ఒక జిల్లా సమాఖ్య ఉండగా.. 21 మండల మహిళా సమాఖ్యలు ఉన్నాయి. గ్రామ మహిళా సంఘాలు 788 ఉన్నాయి. జిల్లాలో ఉన్న 19,192 స్వయం సహాయక సంఘాల్లో మొత్తం 2,06,715 మంది సభ్యులు కొనసాగుతున్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధ్దికి ఏటా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్న జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలు అందించి స్వావలంబనకు తోడ్పాటునందిస్తున్నది. 2022-23 సంవత్సరంలో 12,061 సంఘాలకు రూ.811కోట్ల రుణాలను అందజేశారు. 2023-24 సంవత్సరానికి 12,989 సంఘాలకు రూ.710కోట్ల రుణం ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే గ్రామీణాభివృద్ధి శాఖ రుణ లక్ష్యాన్ని అధిగమించింది. దీంతో రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఈ ఏడాది నాలుగో స్థానంలో నిలిచింది. గడచిన పదేండ్లలో ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా రూ.4,298 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందజేసింది.
ఆర్థిక స్వావలంబన దిశగా..
ఏటా జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధి శాఖ రుణాలను మహిళా సంఘాలకు అందజేస్తూ వస్తున్నది. పాత సంఘాలతో పాటు కొత్తగా ఏర్పడిన సంఘాలకు సైతం బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇస్తున్నారు. రూ.50వేల నుంచి రూ.20లక్షల వరకూ రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు డెయిరీ, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగడంతోపాటు రుణాలను సైతం సక్రమంగా చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో 1.03 ఎన్పీఏతో జిల్లా రాష్ట్రంలో టాప్ టెన్లో ఉన్నది. మహిళా సంఘ సభ్యులు సకాలంలో రుణాలు చెల్లిస్తుండడంతో బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.