వికారాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై ఏ పార్టీ జెండా ఎగురనుందనేదానిపై జిల్లా అంతటా ఆసక్తికరంగా మారింది. చేవెళ్ల పార్లమెంట్ పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఇక్కడ త్రిముఖ పోటీ జరుగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన గులాబీ పార్టీ మరోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించేలా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ను రంగంలోకి దింపింది.
ఒకరిద్దరు నాయకులు పార్టీ మారినా.. ఇప్పటికే బలమైన క్యాడర్ ఉన్న దృష్ట్యా గెలుపు బీఆర్ఎస్ పార్టీనే వరించనున్నదనే చర్చ జరుగుతున్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఆయన ఎంపీగా ఉన్న సమయంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆపదొచ్చి కలిసేందుకుపోతే అపాయింట్మెంట్ ఉందా, ఇంటికి రావద్దంటూ బయటి నుంచే పంపించేవారని, కొండాను మళ్లీ గెలిపిస్తే ఆ తిప్పలు తప్పవనే ప్రచారం జరుగుతున్నది.
అదేవిధంగా అనామకుడిని తీసుకొచ్చి ఎంపీగా గెలిపించిన బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్రెడ్డిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రంజిత్రెడ్డి ద్రోహి.. ఈ దఫా ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.. డబ్బుతో చేవెళ్ల ప్రజలను కొనలేరంటూ’ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుండడం గమనార్హం. ఒకవేళ రంజిత్రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే.. ఇప్పటికే టికెట్ ఆశించి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన పట్నం మహేందర్రెడ్డి కుటుంబం రంజిత్ రెడ్డికి మద్దతివ్వరనే ప్రచారం కూడా జోరందుకున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది. అటు పట్టణ, ఇటు గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ దీన్ని ఏర్పాటు చేశారు. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్లో పరిధిలో ఉన్నాయి. అయితే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి మొదటిసారి 2009లో ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎస్.జైపాల్ రెడ్డి గెలుపొందారు.
అనంతరం 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. 2014 ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019 ఎన్నికల్లో గడ్డం రంజిత్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా గెలుపొందారు. కాగా, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 24,43,112 మంది ఓటర్లున్నారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి 14,317 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి 40.62 శాతం ఓట్లురాగా, కాంగ్రెస్ పార్టీకి 39.5 శాతం, బీజేపీకి 15.53 శాతం, నోటాకు 0.71 శాతం ఓట్లు వచ్చాయి.
బీఆర్ఎస్ పార్టీ నుంచి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ బరిలో దింపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు సేవాగుణం ఉన్న కాసానికే అన్ని వర్గాల ప్రజలు పట్టం కట్టే అవకాశాలున్నాయి. ముఖ్యంగా స్థానికుడు కావడంతోపాటు ఉమ్మడి జిల్లా ప్రజలకు సుపరిచితుడు కావడంతో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమనే జరుగుతున్నది.