బషీరాబాద్, జనవరి 23 : రైతులకు ఉత్తమ సేవలందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. సోమవారం నవాంద్గి సహకార సంఘం ఆధ్వర్యంలో రూ. 2కోట్ల నాబార్డు నిధులతో నిర్మించనున్న గోదాం, రైస్మిల్ నిర్మా ణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో రైతులకు మరిన్ని సేవలందించేందుకు వీలుపడుతుందన్నారు. రైస్ మిల్, గోదాంల నిర్మాణంతో మండల రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైస్మిల్ నిర్మాణం పూర్తయితే రైతులు పండించిన ధాన్యం సహకార సంఘం కొనుగోలు చేస్తుందని తెలిపారు. గోదాం నిర్మాణంతో రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
గోదాం, రైస్ మిల్ వద్దకు వచ్చేందుకు రోడ్డు సౌకర్యం, భవిష్యత్ అవసరాల కోసం ఎకరం స్థలం ఇప్పించాలని చైర్మన్ అల్లాపూరం వెంకట్రాంరెడ్డి ఎమ్మెల్యేను కోరగా, రోడ్డు నిర్మాణం కోసం రూ. 10లక్షలు మంజూరు చేస్తామని, స్థలం విషయం అధికారులతో మాట్లాడి కేటాయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, సభ్యులు అశోక్గౌతమ్, శ్రీనివాస్రెడ్డి, హన్మంత్రెడ్డి, నర్సిరెడ్డి, గోపాల్రెడ్డి, గోపాల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామూనాయక్, మహిళా అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ జయమ్మ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
త్వరలో ప్రతి గ్రామానికీ రూ. 50 లక్షల కేటాయింపు
పెద్దేముల్, జనవరి 23 : నిరుపేదలను బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటున్నదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ప్రతి గ్రామానికీ రూ.50 లక్షల నిధులను కేటాయించి ్ర సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలన్నారు.అనంతరం చెక్కులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ ద్యావరి విజయమ్మ,ఎంపీపీ టి.అనురాధ, జడ్పీటీసీ ధారాసింగ్, సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీలఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్చారి, సర్పంచుల, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు జనార్దన్రెడ్డి, ధన్సింగ్, తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి,నాయకులు జితేందర్ రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.