కులకచర్ల, జనవరి 19 : పూల తోటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. సీజన్లో మంచి గిరాకీ ఉండడంతో దానిపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో అధిక లాభాలు ఆర్జించవచ్చనే ఉద్దేశంతో రైతులు ఈ సాగుపై దృష్టి సారించారు. చేమంతి, బంతి, మల్లెపూలు తదితర రకాలను సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. కులకచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లికి చెందిన వెంకటయ్య గౌడ్ తనకున్న ఎకరా పొలంలో చేమంతి పూలతోటను సాగు చేస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం పొందవచ్చనే ఉద్దేశంతో ప్రతి ఏడాది చేమంతి పూలతోటను సాగు చేసి సీజన్లో విక్రయిస్తున్నారు.
ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ఓవైపు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇందుకు అనుగుణంగా ప్రతి ఏడాది చేమంతితో పాటు రకరకాల పూల తోటలను సాగు చేస్తున్నారు. శివమాలధారులు పూజలకు అధిక సంఖ్యలో పూలను కొనుగోలు చేస్తున్నారు. పెండ్లిళ్ల సీజన్లో మంచి గిరాకీ వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. వేసవిలో పూలసాగు లాభదాయకమని చెబుతున్నారు. గ్రామంలో పూల తోటను సాగు చేస్తూ ఇతర పంటల కంటే అధిక లాభాలను ఆర్జ్జిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పూలతోటల సాగుతో చేతినిండా పని ఉండడంతో పాటు లాభాలు ఆర్జిస్తున్నారు. నిత్యం పూలను కోసి సమీపంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలించి మంచి ధరలను పొందుతున్నారు. కిలో పూలు రూ.200 నుంచి రూ.300 వరకు ధర పలుకుతున్నది. అలాగే పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు చుట్టుపక్కలా ఉండే గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నారు. పూలు ఎక్కువగా ఉంటే మహబూబ్నగర్, హైదరాబాద్లోని మార్కెట్కు తీసుకెళ్తున్నారు. ఇతరులపై ఆధారపడకుండా లాభాలు వచ్చే పంటలను సాగు చేసేందుకు రైతులు మక్కువ చూపిస్తున్నారు.
నా కొద్దిపాటి పొలంలో ప్రతి ఏటా చేమంతి పూలతోటను తక్కువ నీటితో సాగు చేస్తున్నాను. అధిక ఆదాయం పొందుతున్నాను. పెండ్లిళ్ల సీజన్తో పాటు ఇతర శుభకార్యాల సమయంలో మంచి గిరాకీ ఉంటుంది. అలాగే కులకచర్ల, మహబూబ్నగర్ తదితర ప్రాంతాలకు తరలించి పూలను విక్రయిస్తున్నాను.
– ఎముకంటి వెంకటయ్య గౌడ్, ఇప్పాయిపల్లి, కులకచర్ల