పంట పొలాల్లో ఎడ్లు నాగలితో వ్యవసాయ పనులు చేయడం, పంట ధాన్యాన్ని, పంటకు అవసరమైన వస్తువులను ఎడ్ల బండ్లలో చేరవేసుకునే రోజులు పోయి చాలా కాలమైంది. వ్యవసాయంలో వాహన, యంత్ర వినియోగం కొనసాగుతున్నది. ఇందులో ట్రాక్టర్ వినియోగం సర్వసాధారణంగా మారింది. దుక్కి దున్నడం, గొర్రొప్పడం, వరినారు దాటించడం, విత్తనాలు, వరినాట్లు వేయడం, ఎరువులు, విత్తనాల బస్తాలు చేరవేసుకోవడం, పంట దిగుబడి ధాన్యాన్ని తరలించుకోవడం, వ్యవసాయ కూలీలను చేరవేయడం తదితర పనులెన్నో ట్రాక్టర్ల ద్వారానే జరుగుతున్నాయి.
పంట పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్లు తిరగబడి పోయిన ప్రమాదాల్లో రైతులు, డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తరచూ ఎక్కడో ఒక చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలతో అన్నదాతలు, డ్రైవర్లు మృత్యువాత పడుతుండడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం మిగులుతున్నది. అన్నం పెట్టే పంట భూముల్లో అర్ధాయుష్షు దృశ్యాలు హృదయ విదారకంగా ఉంటున్నాయి.
– న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ
పంట పొలాల్లో ముఖ్యంగా వరి నాట్లు వేస్తున్న సమయంలో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. వానకాలం, యాసం గి పొలాల పనుల ప్రారంభ దశలో ట్రా క్టర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే ట్రాక్టర్లు బోల్తా కొట్టడం, లేదంటే పొలాల మధ్యలో ఉన్న చిన్నచిన్న దారులు, కల్లాల్లో ట్రాలీ అన్లోడింగ్ సమయంలో పైన ఉండే విద్యుత్ వైర్లు తాకడం లాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. ట్రాక్టర్లతో వ్యవసాయ పనులు చేయడంలో నేర్పుగా ఉండడం తదితర జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాల బారినపడకుండా చూసుకోవాలి. ప్రస్తుతం యాసంగి సాగు పనులు ప్రారంభమై వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ల వినియోగం మొదలైనందున రైతులు, డ్రైవర్లు తగు జగ్రత్తలు పాటించాలి.
పంట పొలాలు, కల్లాల వద్ద వ్యవసాయ పనుల సమయంలో సంభవిస్తున్న ప్రమాదాలపై జరిగిన పలు అధ్యయనాల ప్రకారం 31శాతం ప్రమాదాలు వ్యవసాయ ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్నవే. 2శాతం వివిధ మిషన్లు, 4శాతం రసాయన మందుల పిచికారీ, 6శాతం పవర్ టిల్లర్లు, 9శాతం చాప్ కట్టర్లు, 12 శాతం మోటర్లు, పంపుసెట్లు, 14 శా తం నూర్పిడి మిషన్లు, 22 శాతం జంతువుల సాయంతో నడిపే లేదా ఉపయోగించే వ్యవపాయ పరికరాల ద్వారా జరుగుతున్నాయి. ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు దారా జరిగే ప్రమాదాలను కలుపుకొంటే 37 శాతం ప్రమాదాలు ట్రాక్టర్ల ద్వారానే జరుగుతున్నాయి.