Snake Bites | యాచారం, జూన్ 29 : అసలే వర్షాకాలం ఆపై ముమ్మరంగా కొనసాగుతున్న వ్యవసాయ పనులు దీనికి తోడు ఇది పాముల కాలం వెరసి రైతన్నలకు విషసర్పాలతో పొంచి ఉన్న ప్రమాదం. వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు, సూచనలతో పాటుగా అప్రమత్తతే రైతులకు శీరామ రక్ష కానుంది. వర్షాకాలంలో వ్యవసాయ పనుల్లో తలమునకలైన రైతులు గతంలో పాము కాటుకు గురై తమ నిండు ప్రాణాలను కోల్పోయారు. గ్రామీణ ప్రాంతాలతో పాటుగా గిరిజన తండాలలో ఇలాంటి ఘటనలు అధికంగా చోటు చేసుకుంటాయి. నానక్నగర్ గ్రామంలో ఓవ్యక్తి పాముకాటుకు గురై ప్రాణాలు విడిచాడు. మేడిపల్లిలో రెండు సర్పాలు ఓ ఇంట్లో ఉండగా స్థానికులు చంపేశారు. పొలంలో పనులు నిర్వహిస్తున్న మహిళ కూలి తేలు కాటుకు గురైంది. ఇలా వర్షాకాలంలో విషసర్పాలతో రైతులకు కూలీలకు ప్రమాదం పొంచి ఉంది. గతంలో ఆదునిక వైద్యం అందుబాటులో లేకపోవడంతో నాటు వైద్యాన్ని, మంత్రాలు, ఆకురసం, చెట్ల మందులైన మూడ నమ్మకాలను నమ్ముకొని పాముకాటుకు గురైన రైతులు, ప్రజలు ప్రాణాలు విడిచేవారు. అయితే ప్రస్తుతం అన్ని ప్రభుత్వ దవాఖానాలో పాముకాటు మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు పాముకాటుకు గురైన వెంటనే బాధితున్ని సకాలంలో దవాఖానాకు తరలిస్తే అతని ప్రాణాలను కాపాడవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పాములతో పాటు ఇతర విష కీటకాలు తమ ఆవాసాలను విడిచి బయట సంచరిస్తాయి. ధాన్యపు గాదెలు, గడ్డివాములు, చెట్ల పొదలు, రాళ్ల కుప్పులు, పొలంగట్ల వద్ద ఉన్న రంద్రాల వద్ద ఎలుకలు ఉండటంతో వాటిని తినడానికి పాములు సంచరిస్తుంటాయి. దీంతో పాటుగా తడిగా ఉన్న ప్రాంతాలలో కప్పలు అధికంగా తిరుగుతుంటాయి. కప్పలను తినడానికి పాములు వస్తుంటాయి. ఎలుకలను, కప్పలను తినడానికి కట్ల పాము, నాగుపాము, రక్త పింజర, జెర్రిపోతు. నీరుకట్ట తదితర పాములు అధికంగా సంచరిస్తాయి. వర్షం నీటితో పుట్టలు నిండటంతో పాటు ఎండా వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి చల్లటి గాలలుకు అవి బయటకు వస్తాయి. ఆహారం తినడానికి బయటికి వచ్చిన సమయంలో మనుషులు ఎదురైతే అవి దాడి చేసి కాటేస్తాయి. దుంగలు, కట్టెలు, గడ్డివాములు, పొలంగట్ల వద్ద ఉన్న రంద్రాలు, చెట్లు, రాళ్ల పొదలలో పాములు అధికంగా ఉంటాయి. దీంతో పోలాల వద్ద వర్షాకాలంలో పాముల బెడద అధికంగా ఉంటుంది. పొలాల వద్ద వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు రైతులు, కూలీలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. దుంగలు, కర్రలు, రాళ్లు కదిలించేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. అక్కడ పాములతో పాటుగా తేళ్లు, జెర్రులు ఉండి రైతులను కాటేసే ప్రమాదం ఉంది. ఇలా వర్షా కాలంలో చల్లటి గాలులకు పాములు బయట సంచరిస్తుంటాయి.
పొలాల వద్ద పాములు కాటేస్తే తేలికగా తీసుకుంటే ప్రామాదాలకే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా నాటు వైద్యాన్ని నమ్ముకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పాతకాలం మాదిరిగా పాము కరిచిన చోట్ల చెట్ల మందులు, ఆకు రసాలు, మంత్రాలు వేయడం మానుకోవాలి. ముఖ్యంగా పాము కరవగానే ఆందోళన చెందకూడదు. దీంతో గుంటె పోటు వచ్చె అవకాశాలున్నాయి. పాము కరువగానే ప్రాథమిక చర్యగా పాము కరిచిన పైబాగంలో తాడుతో, బట్టగుడ్డతో కట్టుకట్టాలి. కరిచిన చోట పొటాషియం పర్మాంనేట్తో కడిగి ఆ భాగంలో ఉన్నరక్తాన్ని పిండి బయటకు తీసి శుభ్రం చేయాలి. గాయం వద్ద వేడి నీటిని పోయడంతో కొంత మేర విషం బయటకు పోతుంది. అనంతరం పాము కరిచిన చోట పటిక ముక్కను ఉంచాలి. పాముకాటుకు గురైన వ్యక్తి శ్వాసను కోల్పోతే కుత్రిమ శ్వాసను అందించాలి. బాధితునికి వేడినీళ్లు కాఫీ, పాలు తాగించాలి. వెంటనే చికిత్స కోసం వీలైనంత త్వరగా దవాఖానాకు చేరుకోవాలి. రైతుకు ఏ పాము కరిచిందో స్పష్టంగా చెబితే దానికి తగ్గట్లుగా సరైన వైద్యాన్ని అందించడంతో ప్రమాదం నుంచి ప్రాణాలను త్వరగా కాపాడుకోవచ్చు. పాము కరిచిన చోట రెండు బలమైన కాట్లు పడితే అది విషసర్పంగా గుర్తించాలి. కట్ల పాము కరిస్తే క్షణాల్లోనే విషం రక్త కణాల్లోకి చేరుకుంటుంది. దీంతో ప్రమాదం అధికంగా ఉండటంతో వెంటనే చికిత్స నిమిత్తం దవాఖానాకు వెళ్లాలి. నాగు పాము కరిస్తే 15నిమిషాలలోపే విషం శరీరంలోకి చేరుతుంది. 15-20నిమిషాల్లో దవాఖానాకు వెళ్లాలి లేదంటే ప్రాణాలకు ప్రమాదం సంబవించవచ్చును. రక్త పింజర ఇది కాటేసిన రెండు గంటల తరువాత విషం శరీరంలోకి ప్రవేశిస్తుంది. జెర్రిపోతు, నీరుకట్ట పాములతో పెద్దగా ప్రమాదం లేకపోయిన చికిత్సమాత్రం తప్పనిసరిగా చేయించుకోవాలి. పాము కరువగానే కొన్ని ఆకుల రసాలు పిండి పోస్తారు ఇది అంత మంచిది కాదని, ఏదేమైనా దవాఖానాలో తప్పని సరిగా చికిత్స చేయించుకోవాలని వైద్యలు చెబుతున్నారు. దవాకానాలో యాంటీ వీనమ్ సిరం, యాంటి బయాటిక్స్ ఇంజక్షన్లు వేయించాలని పేర్కొంటున్నారు.
వర్షాకాలంలో విష సర్పాల నుంచి రక్షణ పొందడానికి ఇళ్ల వద్ద, పొలాల వద్ద పరిశుభ్రతను పాటించాలి. అపరిశుభ్రంగా ఉండటం, చెత్తా, చెదారం, రాళ్లు రప్పలు. ముళ్ల పొదలు, రంద్రాలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాములు ఎక్కువగా ఇలాంటి చోటే అదికంగా ఉంటాయి. ఇళ్ల గోడల పక్కన కట్టెలు, రాలు, రంద్రాలు లేకుండా చూసుకోవాలి లేదంటే వాటి ద్వారా పాములు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉంది. ఇంటి పరిసరాల వద్ద, పశువుల పాకల వద్ద ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టు ముట్టు గడ్డి లేకుండా చూసుకోవాలి. చీమలు పుట్టలు, రంద్రాలు ఉంటే వాటిని మూసి వేయాలి. ఎప్పుడు చీకటి కాకుండా తరుచూ వెలుగులు ఉండేలా చూసుకోవాలి. చీకట్లో వెలుతురు లేకుండా బయటకు వెళ్లడం మంచిది కాదు. బయటకు వెళ్తే పాదరక్షలు తప్పకుండా వేసుకోవాలి. పొలం గట్ల వద్ద నడుస్తుంటే చెప్పులు వేసుకొని టార్చి లైట్ వేసుకొని కర్రను చప్పుడు చేసుకుంటూ వెళ్లాలి. శబ్దంతో పాములు పక్కకు జరిగే అవకాశాలున్నాయి.
పాముకాటుకు గురికాకుండా రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పాముకాటు వేస్తే ఎలాంటి ఆందోళన చెందవద్దు. పాముకాటుతో భయాందోళనకు గురైతే గుంటెపోటు వచ్చి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. బాధితుని నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాముకాటును నిర్లక్ష్యం చేయవద్దు. మూడనమ్మకాలను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. పాము కాటు వేసిన వెంటనే వైద్యున్ని ఆశ్రయించి చికిత్స పొందాలి. పాముకాటు వేయగానే ప్రథమ చికిత్స ఎంతో అవసతరం. సకాలంలో బాధితున్ని దవాఖానాకు తీసుకొస్తే ప్రమాదం తప్పుతుంది. ముఖ్యంగా వీలేతే ఏ పాము కరిచిందో చెప్పడం లేదా దానిని చంపతే దవఖానాకు తీసుకొస్తే మెరుగైన వైద్యం అందించవచ్చు. పాము కాటుకు ప్రభుత్వ దవాకానాలో మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.