ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 9 : మండల పరిధిలోని దండుమైలారం కంటివెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గురువారం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హాజరైన వైద్యాధికారి పూనమ్ మాట్లాడుతూ.. కంటివెలుగు కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.
షాద్నగర్రూరల్ : ప్రతి ఒక్కరూ కంటివెలుగు క్యాంపులో కంటి పరీక్షలు చేయించుకోవాలని ఫరూఖ్నగర్ మండలంలోని విఠ్యల సర్పంచ్ జయశ్రీ అన్నారు. గ్రామంలో కంటివెలుగు క్యాంపును గురువారం ఆమె ప్రారంభించారు. కంటి సమస్యలను గుర్తించి వెంటనే అద్దాలను క్యాంపులోనే ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : కంటి వెలుగు కార్యక్రమం లో మండల పరిధిలోని కౌకుంట్ల, ఆలూరు గ్రామాల్లో జోరుగా సాగుతున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షల కోసం వచ్చిన వారికి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు, మందులు అందజేస్తున్నారు.
పెద్దఅంబర్పేట : కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. మున్సిపాలిటీలో గురువారం వరకు మూడు ప్రాంతాల్లో కంటి పరీక్షల వైద్య శిబిరాలు నిర్వహించారు. ఇప్పటివరకు 320 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్టు శిబిరాల ఇన్చార్జి యాదగిరి తెలిపారు. 366 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించినట్టు చెప్పారు. వీరిలో అత్యవసరమైన వారికి అద్దాలు అందజేసినట్టు పేర్కొన్నారు. 290 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ప్రతి శిబిరంలోనూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్నది.
యాచారం: మండలంలోని గున్గల్, యాచారం గ్రామాల్లో కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. యాచారంలో డాక్టర్ ప్రియాంక, గున్గల్లో డాక్టర్ మౌనిక ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి రాజ్యలక్ష్మి కోరారు.