షాబాద్, మే 9 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 11,376 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 495 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 436 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
417 గ్రామాలు, 81 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం 4766 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 494 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 545 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 417 గ్రామాలు, 81 వార్డుల్లో వైద్య శిబిరాలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
మందులు, అద్దాలు ఇచ్చిండ్రు ; బస్తేపురం లక్ష్మమ్మ, దేవునిఎర్రవల్లి, చేవెళ్ల మండలం
కొన్ని దినాల సంది.. నా కండ్లు మసకగా కనిపిస్తున్నయ్. ఊర్లనే కంటి పరీక్షలు చేస్తున్నరని తెలుసుకొని వచ్చిన. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇచ్చిండ్రు. ఇంతకుముందు గిసొంటి పని ఏ సర్కారోళ్లూ జేయలే. మాలాంటి పేదళ్లోకు.. గీ కంటి వెలుగు సానా మంచిగా ఉపయోగపడింది. గిప్పుడు కండ్లు తేటగా కనిపిస్తున్నయి. సీఎం కేసీఆర్ సార్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.