సిటీబ్యూరో: నగరవాసులకు గుడ్న్యూస్. మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుకుంటుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు మొదలుకానున్నది. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 నుంచే సర్వీసులు నడుస్తాయి. పొడగించిన వేళలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రతి రోజూ 4.5 లక్షల మంది ప్రయాణికులు
నార్సింగిలో తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీన్ ఆన్వల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సమ్మిట్-2024 జరిగింది. ఈ కార్యక్రమానికి మెట్రో రైల్ ఎల్ అండ్ టీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మురళీ వరద రాజన్ హాజరయ్యారు. ‘ద మొబిలిటీ ఫర్ టుడే అండ్ టుమారో’ అంశంపై ఆయన ప్రసంగించారు. ప్రతి రోజూ మెట్రో సేవలను 4.5 లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకుంటున్నారని, సగటు ట్రిప్ పొడవు 12.5 కిలోమీటర్లు అని వివరించారు. నగరవాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా మెట్రో సమయాన్ని మరో 45 నిమిషాల పాటు పొడిగించినట్లు వెల్లడించారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ ‘ద బెస్ట్ గ్రీనింగ్ ద ఫ్యూచర్2023-24’ అవార్డును దక్కించుకున్నది.