కొడంగల్, డిసెంబర్ 29 : పట్టుదల ఉంటే రంగం ఏదైనా రాణించొచ్చని పేదింటి బిడ్డ లు నిరూపిస్తున్నారు. పట్టణంలోని ఒకే ఇంటికి చెందిన అన్నాచెల్లెళ్లు నలుగురు వివిధ క్రీడల్లో రాణిస్తూ పతకాలు సాధి స్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నా రు. వారే కటికె మహేశ్, శోభారాణిల సంతానమైన సంధ్యారాణి, శివరాణి, రాకేశ్, కిరణ్లు.
మహేశ్కుల వృత్తి అయి న మాంసం అమ్మకాలతోపాటు మిగిలిన సమయంలో కూలీ పనులకు వెళ్తూ తన పిల్లలకు ఉన్నత విద్యతోపాటు వారికి ఇష్టమైన క్రీడల్లో రాణించేలా సహకరిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు అనుకూలించకున్నా వారికి అండగా ఉండి ప్రోత్సహిస్తున్నాడు. దీంతో ఆ అన్నాచెల్లెళ్లు తల్లిదండ్రుల కష్టాన్ని వృథా కాకుండా క్రీడల్లో రాణిస్తూ బహుమతులను సొంతం చేసుకుంటున్నారు. కాగా పిల్లలను ఉన్నంతగా తీర్చిదిద్దినందుకు మహేశ్ను పట్టణంలోని పలువురు అభినందిస్తున్నారు.
పెద్ద కుమార్తె సంధ్యారాణి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. క్రీడలపై ఉన్న ఆసక్తితో బీపీఈడీ చదివి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాలను సాధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పోటీ పరీక్షల్లో పాల్గొని సత్తా చాటింది. ఏఆర్ కానిస్టేబుల్గా ఓపెన్ విభాగంలో ఉద్యోగాన్ని సాధించింది. ఒక్క మార్కు తేడాతో ఎస్ఐ జాబ్ను కోల్పోయింది.
రెండో కుమార్తె శివరాణి డిగ్రీ చదువుతున్నది. ఆమెకు అథ్లెటిక్స్ అంటే ఎంతో ఇష్టం. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని అనేక బహుమతులను కైవసం చేసుకున్నది. గత నెల గచ్చిబౌలిలో జరిగిన 5 కి.మీటర్ల దూరం రాష్ట్రస్థాయి పరుగు పం దెంలో విజేతగా నిలిచి పలువురి మన్ననలు పొందింది. జాతీయస్థాయి క్రీడల్లోనూ రాణిస్తానని నమ్మకంతో చెబుతున్నది.
పెద్ద కుమారుడు రాకేశ్ బీఎస్సీ (అగ్రికల్చర్ డిగ్రీ) పూర్తి చేశాడు. ఈయనకు కూ డా పరుగు పందెం అంటే మక్కువ. గత నెల గోవాలో జరిగిన 800 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని బంగారు పతకాన్ని సాధించి అందరినీ అబ్బురపరిచాడు. ఇటీవల నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించాడు.
చిన్న కుమారుడు కిరణ్ బీకాం చదువుతున్నాడు. పరుగు పందెం పో టీల్లో రాణిస్తూ ఇప్పటివరకు ఆరు బంగారు పతకాలను కైవసం చేసుకున్నాడు. గతనెల కరీంనగర్లో జరిగిన 1500 మీటర్ల పరుగు పందెం పోటీల్లో కిరణ్ రాష్ట్ర చాంపియన్షిప్ను అందుకున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన క్రీడాపోటీలు ఎంతో ఉపయోగపడ్డాయని వారు పేర్కొన్నారు.