వికారాబాద్, డిసెంబర్ 20 : ప్రతి ఒక్కరూ లింగ సమానత్వంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి తెలిపారు. మంగళవారం లింగ వివక్షత లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం 2022 అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏహెచ్టీయూ టీం ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు, బాలబాలికలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వీటికి సంబంధించిన రెండు మూడు కేస్ స్టడీలను వివరించారు. పాఠశాలలు, కళాశాలలు, మారుమూల గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు ఎస్పీ రషీద్ మాట్లాడుతూ.. కుటుంబంలో, సమాజంలో లింగ సమానత్వం అత్యంత ముఖ్యమన్నారు. పిల్లల తల్లిదండ్రులే వారికి మొదటి ఆదర్శమన్నారు.
పిల్లలతో పాటు వయస్సును బట్టి లింగ సమానత్వానికి సంబంధిత విషయాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. లింగ, జాతి, ధర్మం, సామాజిక, ఆర్థిక, విద్య స్థాయిలో సంబంధం లేకుండా పరస్పరం గౌరవంగా ఉండాలని వివరించారు. కాన్ఫరెన్స్లో ఏహెచ్టీయూ టీమ్ జిల్లా ఇన్చార్జి సీఐ దాసు, డీఈవో రేణుకాదేవి, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటేశ్, బీఆర్బీ కో ఆర్డినేటర్ లక్ష్మి, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ రామేశ్వర్, ఎంవీ ఫౌండేషన్ ఆశాలత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.