చేవెళ్లటౌన్ : ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బంగారు మైసమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠపాన కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామ గేటు సమీపంలోని దేవాలయంలో యజ్ఞాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీపీ విజయలక్ష్మి, నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో పాటు భక్తులు, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. బంగారు మైసమ్మ దేవాలయ ఆవరణలో రెండు రోజుల నుంచి వివిధ పూజలు నిర్వహిస్తున్నట్టు సర్పంచ్ తెలిపారు. నేడు వేదపండితుల ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠపాన కార్యక్రమం ఉంటుందని, కార్యక్రమానికి భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అక్కడికి వచ్చిన భక్తులకు దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.