ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు నగర శివారుల్లో గుట్టుగా కోడి పందాలు నిర్వహించడం.. పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతూనే ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసులు ఈసారి కోడి పందాల నిర్వహణకు ఆదిలోనే అడ్డుకట్ట వేసే పనిలో నిమగ్నమయ్యారు. గస్తీ పెంచి ఏర్పాట్లపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అయినా నిర్వాహకులు కోడి పందాల నిర్వహణకు సీక్రెట్గా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ పోలీసులకు సవాలు విసురుతున్నారు.
-ఇబ్రహీంపట్నం, జనవరి 13
సంక్రాంతిని పురస్కరించుకొని నగర శివారులో కోడి పందాల నిర్వహణకు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పందెం రాయుళ్లు మూడోకంటికి తెలువకుండా సర్వం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటుకబట్టీల యజమానులతో పాటు అక్కడ పనిచేసే ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన చెందిన అనేకమంది ఈ పందాలలో పాలుపంచుకుంటున్నారు. పందెం రాయుళ్లు ఇప్పటికే కోడి పుంజులను పెంచి పోరుకు సిద్ధంగా ఉంచారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో పందెం కోళ్ల పెంపకం పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇతర ప్రాంతాలకూ ఇక్కడినుంచే తరలిస్తున్నారు. ఒక్కో కోడి పుంజును రూ.10వేల నుంచి రూ.30వేల వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలోని ఆదిబట్ల, నాదర్గుల్, బొంగుళూరు, ఎలిమినేడు, మాదాపూర్, రాగన్నగూడ, మన్నెగూడ, తుర్కయాంజాల్ వంటి శివారు ప్రాంతాల్లో కోడి పందాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గత సంక్రాంతి పండుగ సందర్భంగా శివారు ప్రాంతాల్లో అనేకమంది కోడిపందాలు నిర్వహిస్తూ పటుబడ్డారు. ఈ నేపథ్యంలో ఈ సారి పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. ఎస్వోటీ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ఇటీవలే నాదర్గుల్, కుర్మల్గూడ, మన్నెగూడ, తుర్కయాంజాల్, ఎలిమినేడు, మాదాపూర్ తదితర గ్రామాల్లో కోళ్ల పందాల నిర్వాహకులపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. గతంలో పట్టుబడ్డవారి కదలికలపై సైతం దృష్టి సారించారు. అయినప్పటికీ పందెం రాయుళ్లు రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా కోడిపందాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నగరశివారుల్లో ఇప్పటికే నిఘాను పెంచాం. గతంలో పట్టుబడ్డ నిర్వాహకులపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం. నిర్వాహకులు ఎవరైనా ఉంటే తమ ప్రయత్నాలు మానుకోవాలి.
– శ్రీనివాస్రావు, ఏసీపీ ఇబ్రహీంపట్నం