ధారూరు : ప్రతి ఉద్యోగి విధిగా ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) నమోదు చేసుకోవాలని సహాయ భవిష్యనిధి కమిషనర్ రామసుబ్బయ్య తెలిపారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమోదు చేసిన మొదటి నెల నుంచి ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. ప్రతి నెల సభ్యుల ప్రాథమిక వేత నం, కరువు భత్యం (అత్యధికంగా రూ.15వేలు) యాజమాన్యం కార్మిక, పరస్పర అంగీకారంతో 12శాతం సంస్థకు జమ చేయాల్సి ఉంటుందని, యాజమాన్యం సమానమైన మొత్తం జమ చేస్తుందన్నారు. ఉద్యోగికి విధి నిర్వహణలో దురదృష్ట వశాత్తు మరణం సంభవిస్తే అతడు/ఆమె నామినీ లేదా ఉద్యోగి చట్టపరమైన వారసుడికి చెల్లించే గరిస్ట హామీ ప్రయోజనం రూ.7లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఉద్యోగి మరణానికి ముందు 12 నెలలు నిరంతర ఉద్యోగంలో ఉంటే కనీస హామీ ప్రయోజనం రూ.2.50లక్షలు నేరుగా నామినీ లేదా చట్ట పరమైన వారసుడికి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. సభ్యులు , వారి కుటుంబానికి/నామినీకి ఆర్థిక సహాయం పింఛన్ ద్వారా అందిస్తామని వివరించారు. ఉద్యోగులకు పలు విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వెంకటరమణ, మున్సిపల్ సిబ్బంది, వివిధ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.