ఓటు హక్కు వజ్రాయుధం వంటిది. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనల్ని పాలించే ఉత్తమ పాలకులను ఎన్నుకునే గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసారి 80 ఏండ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. మహిళలు, దివ్యాంగులు, కొత్త ఓటర్లకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఈవీఎం డెమో స్టేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 33,56,056 మంది ఓటర్లు ఉన్నారు. ఓటు బదిలీ, కొత్త ఓటు నమోదుకు ఈ నెలాఖరు వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
– రంగారెడ్డి, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం కూడా ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం చేస్తున్నది. సంచార రథాల(మొబైల్ వాహనాలు) ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఈవీఎం డెమో స్టేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి పనితీరుపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మరోపక్క మహిళలు, దివ్యాంగులు, కొత్త ఓటర్లకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 33,56,056 మంది ఉండగా..ఈ నెలాఖరు వరకు ఓటు బదిలీ, కొత ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆయా ఓటర్లకు రానున్న ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం దక్కనున్నది.
ఎన్నికల్లో గ్రామీణులే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్షరాస్యులు, విద్యాధికులు, ఉద్యోగాలు చేసేవారు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుండడం కలవరపరుస్తున్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలింగ్ శాతం పెంపు కోసం అధికార యంత్రాంగం ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే కసరత్తును మొదలు పెట్టింది. యువతలోనూ ఓటింగ్పై ఆసక్తి పెంపొందేలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నది.
జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరీ ప్రత్యేక దృష్టి పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికీ ఒకటి చొప్పున సంచార రథాన్ని అందుబాటులోకి తెచ్చారు. గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించి ఓటింగ్పై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ఈవీఎం డెమో స్టేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల పనితీరుపై ఏవైనా సందేహాలు ఉంటే ఈ కేంద్రాలలో నివృత్తి చేసుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈసారి ఎన్నికల కమిషన్ వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది. జిల్లా వ్యాప్తంగా 80 ఏండ్లు దాటిన వృద్ధ్దులు 43,541 మంది ఉన్నారు. వీరిలో కదలలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. ఎన్నికలకు వారం రోజుల ముందుగా వారికి 12డీ ఫారం ఇచ్చి మొబైల్ టీం పరిశీలించిన తర్వాత ఓటు హక్కుకు అవకాశం కల్పించనున్నారు. అలాగే గతంలో కేవలం మహిళలు, దివ్యాంగులకు మాత్రమే ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేశారు. అయితే ఈసారి యువతకు కూడా మాడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో కొత్త ఓటర్లు 66,359 మంది ఉన్నట్లు గుర్తించారు. అక్టోబర్ 31 నాటికి కొత్తగా ఓటు నమోదుకు, బదిలీకి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో యువతకు జిల్లాలో 52 మాడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నారు. జిల్లాలో దివ్యాంగులు 45,200 మంది, దృష్టి, మూగ, చెవిటి లోపం ఉన్నవారు 48,603 మంది ఉన్నారు. వీరి కోసం 8 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఓటింగ్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సంచార రథాలను సోమవారం జిల్లా కలెక్టర్ హోలీకేరీ కలెక్టరేట్లో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఓటు హక్కుపై చైత న్యం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే సంచార రథాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్ర తిమాసింగ్, జడ్పీ సీఈవో దిలీప్ కుమార్, డీఆర్డీవో పీడీ, స్వీప్ నోడల్ అధికారి ప్రభాకర్, ఆర్డీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.