అమీర్పేట్, ఫిబ్రవరి 25 : బీమాదారులకు మరింత మేలైన సేవలే లక్ష్యంగా ఈఎస్ఐసీ వైద్యులు, సిబ్బంది తమ వంతు సేవలందిస్తారని సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాల డీన్ డాక్టర్ మాధురి శ్రీష్కాటే పేర్కొన్నారు. ఈఎస్ఐసీ 72వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 72వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో 60 ఏళ్లు పై బడిన వారికి ఈఎస్ఐసీ ద్వారా అందుతున్న చికిత్సల్లో భాగంగా పలు మార్పులు చేసినట్టు తెలిపారు. హోమ్ డ్రగ్ డెలివరీ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రోగులు దవాఖానకు రాలేని పక్షంలో అవసరమైన మందులను 15 రోజుల పాటు వారి ఇంటి వద్దకే పంపడం దీని ఉద్దేశమని తెలిపారు. ఇదే విధంగా వైద్య పరీక్షలకు సంబంధించి శాంపిల్ కలెక్షన్లు కూడా ఇంటి వద్దే సేకరిస్తామని వెల్లడించారు. ఈ సేవలను ప్రస్తుతం హైదరాబాద్లోని ఐపీలకు అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. ఐపీలు ఈఎస్ఐసీ సేవలకు సంబంధించి యాప్ను తమ ఆండ్రాయిడ్లో డైన్లోడ్ చేసుకోవడం ద్వారా సేవలు పొందవచ్చని డీన్ వివరించారు.
అధునాతన సేవలతో 5జీ-ఇ అంబులెన్స్..
దీంతో పాటు ఈ పక్షోత్సవాల్లో భాగంగా 5జీ-ఇ ఆంబులెన్స్ను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. సాధారణ ఆంబులెన్స్లకు పూర్తి భిన్నంగా ఈ కొత్త విధానాంలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. వైద్యశాలకు దూరంగా ఉన్నా కూడాసిబ్బంది ద్వారా ఆంబులెన్స్లో ఉన్న రోగిని హాస్పిటల్లో ఉన్న వైద్యులు పర్యవేక్షించే విధంగా నూతన క్లౌడ్ టెక్నాలజీని కలిగి ఉండటం దీని ప్రత్యేకత అని చెప్పారు. దీంతో రోగిని కాపాడడంలో మరింత మెరుగైన సేవలందించే వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐసీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధిక, తదితరులు పాల్గొన్నారు.