న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ ;ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. యువతులు, మహిళలు తంగేడుపూలు, గూనుగు పూలు, గడ్డిపూలు, బంతి, చామంతి.. వంటి తీరొక్క పూలతో బతుకమ్మలను పోటీపడి పేర్చి అందంగా ముస్తాబు చేశారు. అనంతరం అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి చుట్టూ బతుకమ్మ ఆడారు. “చిత్తూ చిత్తూల బొమ్మ.. శివుడి ముద్దూల గుమ్మ.. ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో..ఒక్కూరికిచ్చిరీ ఉయ్యాలో..” వంటి ప్రత్యేక పాటలతో ఊరూవాడలు మార్మోగాయి. అనంతరం యువతులు, మహిళలు బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేసి చెరువుల్లో నిమజ్జనం చేశారు.
జిల్లాలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి . ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మ ఆట ఆడుతూ పండుగను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను గ్రామ సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు.