షాబాద్, డిసెంబర్ 2 : చేవెళ్ల నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు ఫూర్తి చేసినట్లు చేవెళ్ల డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు. 30వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చేవెళ్ల డివిజన్లోని ఐదు మండలాల్లో 298 పోలింగ్ కేంద్రాల్లో 2.62 లక్షల మంది ఓటర్లు ఉండగా 1.93 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 73.82 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. నియోజకవర్గంలో మొత్తం 2086 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఒటు హక్కును వినియోగించుకున్నారు.
చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపుకోసం ఆదివారం రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్ సాగర్ లార్డ్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు, 22 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ ముగించడం జరుగుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 150 మంది సిబ్బంది పొల్గొంటున్నట్లు చెప్పారు. ఒక్కో అభ్యర్థి తరఫున 20 మంది ఏజెంట్లకు అనుమతి ఉందన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందుగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారని, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత 8:30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు చేపడుతారని తెలిపారు.
నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో 12 మంది అభ్యర్థులు బరిలో నిచారు. బీఆర్ఎస్ నుంచి కాలె యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నుంచి పామెన భీం భరత్, బీజేపీ నుంచి కేఎస్ రత్నంతో పాటు పలువురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వారి భవితవ్యం ఆదివారం తేలనుంది. ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉండగా, చేవెళ్ల గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగురనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నారు.