వికారాబాద్, నవంబర్ 22 : జిల్లాలో శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం (ఈ.సీ.ఐ) సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్వ్యాస్ జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పోలింగ్ నిర్వహణ కోసం చేపట్టిన చర్యలపై ఆయా జిల్లాలవారీగా కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. ఓటింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను ఇప్పటికే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో సగటున 82 శాతం పంపిణీ పూర్తి చేశామని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తెచ్చారు. పోలింగ్ నిర్వహణ కోసం ఈవీఎం బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్, టెండర్ బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయిందని.. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులు 830 మంది హోమ్ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. మరో రెండు రోజుల్లో ప్రత్యేక పోలింగ్ బృందాల ద్వారా మిగిలిన వారందరికీ హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ఈసీ నిబంధనలకు అనుగుణంగా పూర్తి గోప్యత పాటిస్తూ ఓటు సేకరణ జరిపేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఇప్పటికే రెండు విడుతలుగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి పోలింగ్ విధులపై పూర్తి అవగాహన కల్పించామన్నారు. శిక్షణ కేంద్రాల వద్దే ఫెసిలిటేషన్ సెంటర్లను నెలకొల్పి పోలింగ్ విధుల్లో నియమించబడిన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు.
పోలీసులు సహా ఇతర ఎన్నికల విధుల్లో నియమించబడిన సిబ్బంది కోసం రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను ఈసీ దృష్టికి తెచ్చేందుకు వీలుగా అందుబాటులోకి తెచ్చిన సీ.విజిల్ యాప్ గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. జిల్లా స్థాయిలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని తెలిపారు.
అధికారులు అంకిత
సువిధ పోర్టల్ ద్వారా ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు తదితర వాటి కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ గడువులోపు అనుమతులు జారీ చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి వివరించారు. పోలింగ్ నిర్వహణ కోసం రిసీవింగ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను నెలకొల్పి పక్కాగా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలని ఈ.సీ.ఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్వ్యాస్ హితవు పలికారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎంసీసీ నోడల్ అధికారి కృష్ణన్, ఎక్స్పెండీచర్ నోడల్ అధికారి శంకరాచారి, జిల్లా ఆడిట్ అధికారి వీరభద్రారావు, జిల్లా హార్టికల్చర్ అధికారి చక్రపాణి, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోలీకేరీ అన్నారు. నితేశ్వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ నిర్వహణ కోసం చేపట్టిన చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశామని చెప్పారు. ఓటింగ్ వివరాలతో కూడిన స్లిప్పులను జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పంపిణీ చేశామన్నారు.
ఈవీఎం బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్, టెండర్ బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయిందని, కమిషనింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు వీలుగా ఈసీఐఎల్ ఇంజినీర్ల బృందాలు జిల్లాకు చేరుకున్నాయని తెలిపారు. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికిపైగా వైకల్యం ఉన్న దివ్యాంగులను కలుపుకొని మొత్తం 1,968 మంది ఓట్ ఫ్రం హోం సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు అర్హులుగా గుర్తించామని, వారి ఇండ్ల వద్దకే వెళ్లి ఓటును స్వీకరించేందుకు ప్రత్యేక పోలింగ్ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నెల 21 వరకు 1,792 మంది ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకోగా, 1,520 మంది పోలీసు సిబ్బంది పోస్టల్బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారన్నారు.
ఈసీ నిబంధనలకనుగుణంగా పూర్తి గోప్యత పాటిస్తూ ఓటు సేకరణ జరిపేలా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన సీ విజిల్ యాప్పై ప్రజలకు అవగాహన కల్పిం చామని చెప్పారు. జిల్లాస్థాయిలోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. సువిధ పోర్టల్ ద్వారా ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు తదితర వాటికోసం వచ్చే దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ గడువులోపు అనుమతులు జారీ చేస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, సీపీవో దిలీప్కుమార్, ఎన్నికల విభాగం సిబ్బంది సైదులు పాల్గొన్నారు.