కొడంగల్, అక్టోబర్ 18 : గత ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం ఎడారిని తలపించేలా ఉండేదని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాతే కొడంగల్ అభివృద్ధికి ప్రత్యేకంగా కోట్లాది నిధులను మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పడినట్లు మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రతి గ్రామాన్ని, తండాను సందర్శించి పరిశీలించినట్లు.. ఆనాడు గ్రామాలు, తండాల్లో తిరుగలేని పరిస్థితి ఉండేదన్నారు. నేడు ప్రతి గ్రామం, తండా బీటీ, సీసీ రోడ్లతో కళకళలాడుతున్నాయన్నారు. 2018కి ముందు నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోక ఎడారిని తలపించిందన్నారు. పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నియోజకవర్గ అభ్యున్నతికి కృషి చేయడం వల్ల నేడు అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీది నీతిమాలిన రాజకీయమని, టికెట్ల కోసం రోడ్డెక్కుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని నిలదీశారు. అక్కడే ఇవ్వనివారు ఇక్కడ ఇస్తామంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతారన్నారు. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే కాంగ్రెస్, బీజేపీలు తాపత్రయపడుతున్నాయని, ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని మంత్రి పేర్కొన్నారు.
హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ఖాయం
అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడిందని.. ఈ ఎన్నికల్లో పట్నం నరేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనేనని.. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న ఏ ఒక్క పథకం కూడా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. అన్ని కాలాల్లో నీటి ఇబ్బందులు లేకుండా ఉండేలా మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసినట్లు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి పథకంతో జిల్లాలో 4 నుంచి 5 లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గానికి లక్షా49వేల ఎకరాలకు సాగునీరందనున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్ పూర్తి చేయడంతోపాటు చెప్పని ఎన్నో కార్యక్రమాలను అమలు చేసి అభ్యున్నతిలో తెలంగాణను దేశానికి తలమానికంగా నిలబెట్టినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదని, ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను పూర్తి చేసేదీ లేదన్నారు.
ఇంటింటికీ సంక్షేమ పథకాలు
కొడంగల్ నియోజకవర్గంలో రైతు బంధు కింద రూ.91229 మందికి రూ.1,046 కోట్లు, రైతు బీమా ద్వారా 1647 మందికి రూ.82.35 కోట్లు, కల్యాణలక్ష్మి ద్వారా 8860 మందికి రూ.58 కోట్లు, షాదీముబారక్ ద్వారా 1000 మందికి రూ.6.16కోట్లు, ఆసరా పింఛన్ ద్వారా 37,236 మందికి రూ.12కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఏనాడూ నిధులు మంజూరైన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించేలా చేపపిల్లల పంపిణీ, ఆర్థిక ప్రోత్సాహం, దళితుల అభ్యున్నతికి రూ.10లక్షలతో దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధుతో రూ.లక్ష సాయం అందిస్తున్నట్లు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షలు, డబుల్ బెడ్రూంలు అందించినట్లు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ విజయానికి కలిసికట్టుగా కృషి చేద్దామని తెలిపారు. అభివృద్ధికి పాటుపడుతున్న ఇటువంటి పార్టీని ఆదరిద్దాం.. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో పట్నం నరేందర్రెడ్డిని గెలిపిద్దామని కార్యకర్తలకు సూచించారు.
వేల కోట్ల నిధులతో నియోజకవర్గ అభివృద్ధి
ఎమ్మెల్యే నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. వేల కోట్ల నిధుల మంజూరుతో కొడంగల్ అభివృద్ధికి కృషి చేసినట్లు పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో కోస్గిలో 30వేల ఎకరాలకు సాగునీరందనున్నట్లు తెలిపారు. రూ.80కోట్లతో కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. బొంరాస్పేటలో దుద్యాల, కోస్గి మండలంలో గుండుమాల్, కొత్తపల్లి నూతన మండలాలు ఏర్పాటైనట్లు తెలిపారు. ముదిరాజ్, యాదవ, అంబేద్కర్ భవనాలకు రూ.5.50 కోట్లు, బీసీ, ఎస్సీ మైనార్టీ గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు రూ.25 కోట్లు, పీఆర్ రోడ్లకు రూ.217 కోట్లు, ఆర్అండ్బీకి రూ.188 కోట్లు, తండాలకు బీటీ రోడ్లకు ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా రూ.62 కోట్లు, చెక్డ్యాంలకు రూ.51 కోట్లు, ఆలయాలకు రూ.5 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు
తాండూరు : ఎవరెన్ని కుట్రలు చేసినా… ప్రతిపక్షాలు తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ దక్షిణ భారతదేశంలో చరిత్రను సృష్టించబోతున్నారని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. తాండూరులో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వడ్ల కల్లాలప్పుడు అడుక్కుతినే వాళ్లలా.. ఎన్నికలు రాగానే కొందరు బయలుదేరారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తామన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో, మహేందర్రెడ్డి తాండూరులో ఉన్నన్ని రోజులు తట్టుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సీఎం కేసీఆర్ వదిలిన బుల్లెట్లు.. వాళ్లను తట్టుకొని నిలబడే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదన్నారు. ఎన్నికల్లో 100 సీట్లు సాధించి ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా మారిందన్నారు.
జిల్లాలోని 4 అసెంబ్లీల్లో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యత తమదేనన్నారు. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తాండూరు నియోజకవర్గంలో రూ.1672.49 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ.1648.12 కోట్ల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినట్లు తెలిపారు. తాండూరు పట్టణ అభివృద్ధి పనులకు రూ.1191.86 కోట్లు, తాండూరు మండలంలో అభివృద్ధి పనులకు రూ.236.14 కోట్లు, యాలాల మండలంలో అభివృద్ధి పనులకు 97.77 కోట్లు, బషీరాబాద్ మండలంలో అభివృద్ధి పనులకు 68.18 కోట్లు, పెద్దేముల్ మండలం అభివృద్ధి పనులకు రూ.78.54 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థులు తాండూరులో రోహిత్రెడ్డి, పరిగిలో మహేశ్రెడ్డి, కొడంగల్లో నరేందర్రెడ్డి, వికారాబాద్లో ఆనంద్ను మళ్లీ గెలిపించండి. ప్రతిపక్ష నేతల అసత్య మాటలను ప్రజలు నమ్మరాదని సూచించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.