రంగారెడ్డి, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగగా.. బుధవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో జిల్లా టాప్లో నిలిచింది. 71.7 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 77.63 శాతం ఉత్తీర్ణతతో జిల్లా తృతీయ స్థానాన్ని దక్కించుకుంది.
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు రెండింటిలోనూ బాలికలదే హవా కొనసాగింది. మొదటి సంవత్సరం పరీక్షలకు 33,721 మంది బాలికలు హాజరవగా.. 25,879(76.74 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 37,576 మంది హాజరు కాగా.. 23,516 (67.18 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 30,900 మంది బాలికలు హాజరుకాగా.. 25,204 (78 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 33,859 మంది హాజరుకాగా.. 25,069(74.04 శాతం)మంది పాస్ అయ్యారు.
ఒకేషనల్ విభాగంలోనూ బాలికలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో బాలికలు 70.75 శాతం ఉత్తీర్ణులు కాగా.. బాలురు 34.12 శాతం ఉత్తీర్ణతను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 81.74 శాతం, బాలురు 43.85 శాతం ఉత్తీర్ణతను సాధించారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 3,580 మంది బాలబాలికలు పరీక్షలు రాయగా.. 1,819(50.81 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 3,094 మంది బాలబాలికలు పరీక్షలు రాయగా.. 1,919(62.02 శాతం) మంది ఉత్తీర్ణతను సాధించారు.
ప్రభుత్వ కళాశాల విద్యార్థులతోపాటు ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీ, గురుకుల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలను మించి ఫలితాలను సాధించి ఔరా అనిపించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విస్తారంగా కళాశాలలు, గురుకులాలు ఏర్పాటు కావడంతోపాటు మార్కుల కోసం తీసుకున్న చర్యలు ఇందుకు కారణమని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.
ఈ నెల 25 నుంచి మే 2 వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఆన్లైన్లో మార్కులను డౌన్లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.