రంగారెడ్డి జిల్లాలో దేవీ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు పలు రూపాల్లో దర్శనమిచ్చారు. ఆలయాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తి గేయాలకు పరవశించిపోయారు. భజనలు చేశారు. అమ్మవారి పల్లకీ సేవను కనులపండువగా నిర్వహించారు. మహిళా భక్తులు కుంకుమార్చన చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు.
అన్నపూర్ణాదేవిగా..
షాద్నగర్రూరల్, సెప్టెంబర్ 30 : ఫరూఖ్నగర్ మండలంలోని ఎలికట్ట అంబాభవానీ దేవాలయంలో అమ్మవారిని శుక్రవారం అన్నపూర్ణాదేవి అలంకరణతో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల్లో మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ మహేశ్వరి, సర్పంచ్ సాయిప్రసాద్ పాల్గొన్నారు. ప్రముఖ భక్తి గాయకుడు నర్సింహ, శివ ఆలపించిన భక్తిగేయాలకు భక్తులు పరవశించిపోయారు. అనంతరం అమ్మవారి పల్లకీ సేవను కనులపండువగా నిర్వహించారు. శనివారం ఆమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమివ్వనున్నట్లు అర్చకులు తెలిపారు.
లలితాత్రిపురసుందరీదేవి, వాసవీ కన్యకాపరమేశ్వరీదేవిగా..
షాద్నగర్టౌన్ : షాద్నగర్లోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరంలో, పెద్ద జానమ్మపేట లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు లలితాత్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చారు. కౌన్సిలర్ విశాల, మహిళలు కుంకుమార్చన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు కన్యకాపరమేశ్వరీదేవిగా దర్శనమిచ్చారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆర్యవైశ్య, యువజన సంఘం సభ్యులు తెలిపారు.
మహాలక్ష్మీదేవి, లలితాపరమేశ్వరీదేవిగా..
కడ్తాల్ : మైసిగండిలో కొలువైన అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిర్డీ సాయిబాబా ఆలయంలోని అమ్మవారు లలితాపరమేశ్వరీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
శంషాబాద్ రూరల్ : శంషాబాద్లోని ఆర్టీసీ బస్స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాతకు దుర్గాభవానీ యూత్ ఆధ్వర్యంలో కుంకుమార్చన తదితర పూజలు చేశారు.
మహాలక్ష్మీదేవిగా..
ఆమనగల్లు : ఆమనగల్లులోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలోని అమ్మవారు మహాలక్ష్మీదేవిగా ఆవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.