కులవృత్తుల సంక్షేమానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ప్రాధాన్యతనిచ్చి చేపల వేటకు సంబంధించిన సామగ్రి, వాహనాలను సబ్సిడీపై అందించడంతో పాటు అర్హులకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నది. తాజాగా కొత్త సంఘాలతో పాటు అర్హులకు సభ్యత్వాలు ఇచ్చేలా రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ రెండో విడుత స్పెషల్ డ్రైవ్ను చేపట్టింది.
ఇబ్రహీంపట్నం, మార్చి 5 : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మత్స్య శాఖ జిల్లా అధికారులు నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల రిజిస్ట్రేషన్, ప్రస్తుతం ఉన్న సంఘాల్లో అర్హులకు సభ్యత్వాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సభ్యత్వాలు తీసుకుంటే పొందే ప్రయోజనాలపై జిల్లావ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ రెండో విడుతలో సభ్యత్వ నమోదు, సొసైటీల ఏర్పాటు కార్యక్రమాలకు ఏప్రిల్ 5 వరకు గడువు ఉన్నదని అధికారులు తెలిపారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో 148 సంఘాలు ఉండగా, అన్ని రకాల ప్రయోజనాలు, రాయితీలు అందుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నూతన సభ్యత్వం పొందాలంటే..
నూతన సంఘం ఏర్పాటు లేదా కొత్త సభ్యత్వాన్ని పొందాలంటే గ్రామంలో స్థిర నివాసం ఉన్న 11 కుటుంబాలు ఉండాలి. గ్రామంలో నీటి వనరులు వర్షాధార చెరువులైతే ఒక్కో సభ్యుడికి 2 ఎకరాలు లేదా సంవత్సరం పొడవునా నీరు నిల్వ ఉండే చెరువులైతే ఒక ఎకరా నీటి విస్తీర్ణం ఉండాలి. గ్రామం ఏదైనా ఇతర మత్స్యసహకార సంఘం పరిధిలో ఉంటే సహకార సంఘాల చట్టం 1964 నిబంధన ప్రకారం సదరు సంఘం నుంచి విడదీసి నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
ఏజెన్సీ ప్రాంతాల్లో వీరే అర్హులు..
ఏజెన్సీ ప్రాంతాల్లో సంఘంలో సభ్యత్వం పొందేందుకు స్థానిక గిరిజనులు మాత్రమే అర్హులు. వారికి 18 ఏండ్లు నిండి కులం, స్థానిక ధ్రువీకరణపత్రం కలిగి ఉండాలి. ఇతర వృత్తి సంఘాల్లో వారికి సభ్యత్వం ఉండకూడదు. జీవో నంబర్ 74 నిబంధనల ప్రకారం ప్రతి సంఘం నుంచి అనర్హులైన సభ్యులను తొలగించగా ఏర్పడిన ఖాళీల్లో కొత్తవారికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. వృత్తి నైపుణ్యం లేని వారికి ప్రభుత్వమే శిక్షణ ఇస్తున్నది.
మైదాన ప్రాంతాల్లో వీరు అర్హులు..
జీవో ఎంఎస్ నంబర్ 98, 4 ప్రకారం గుర్తించిన (33) కులాలకు చెందినవారు సంఘంలో చేరేందుకు అర్హులు. వీరికి 18 ఏండ్లు నిండి ఉండాలి. ఒక్క కుటుంబం నుంచి ఒక్కరే అర్హులు. స్థానిక, ఆధార్, రేషన్, కుల ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఉద్యోగం చేసేవారు దీనికి అనర్హులు. ఇతర బలహీన వార్గాల సంఘాల్లో సభ్యత్వం ఉన్నవారు అనర్హులే.
రాయితీలు..
గిరిజన మత్స్య సంఘాలకు ఐటీడీఏ ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నది. మత్స్యకారులకు కచ్చు వలలు, విసురు వలలు, పాండ్రి వలలు, తెప్పలు, శీతలీకరణ పెట్టెలు, మోపెడ్స్, నాలుగు చక్రాల వాహనాలు, ప్లాస్టిక్ట్రేలు, కాంటా, బోట్లు, పుట్లు వంటి వాటిని మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా 75 నుంచి 90 శాతం రాయితీపై అందిస్తున్నది. ప్రభుత్వమే ఏటా చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై చేపపిల్లలు, రొయ్యపిల్లలను వదులుతున్నది.
జీవిత బీమా సౌకర్యం..
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పించింది. ప్రమాదవశాత్తు మృతిచెందినా, శాశ్వత అంగ వైకల్యం సంభవించినా రూ.5లక్షలు, పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ.2.50 లక్షలు, ప్రమాదంలో గాయపడి దవాఖానలో చేరితే రూ.25వేల చొప్పున బాధిత కుటుంబానికి పరిహారం అందుతున్నది.
సంఘంలో చేరేవారు నేర్చుకోవాల్సినవి..
సంఘంలో కొత్తగా సభ్యత్వం తీసుకునేవారికి చెరువుల్లో వల విసరడం రావాలి. ఈత తప్పనిసరిగా వచ్చి ఉండాలి. తెప్ప మీద వెళుతూ కచ్చువల వేయాలి. వలలు అల్లడం రావాలి. ఫౌండ్రీ వల లాగడంలో ప్రత్యేకత చూపాలి. ఇవ్వన్ని వచ్చినవారికి సభ్యత్వం అందిస్తున్నది.
నూతన సంఘాల ఏర్పాటుకు కొనసాగుతున్న డ్రైవ్..
కొత్త సభ్యులకు సభ్యత్వం ఇచ్చేందుకు ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు ఇచ్చాం. జిల్లాలో ఇప్పటి వరకు 25 దరఖాస్తులు వచ్చాయి. అనర్హులను తొలగించి కొత్త వారికి సభ్యత్వాలు కల్పిస్తాం. ఈ అవకాశాన్ని జిల్లాలోని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలి.
– సుకీర్తి, మత్స్యశాఖ రంగారెడ్డిజిల్లా అధికారి