చర్లపల్లి, నవంబర్ 25 : సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ఎంఎస్ఎంఈ కృషి చేస్తున్నదని, ప్రభుత్వ పథకాలను పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ డైరక్టర్ జనరల్ డాక్టర్ బీహెచ్వీఎస్.నారాయణమూర్తి పేర్కొన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని పారిశ్రామికవేత్తల సంఘం(సీఐఏ) భవనంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టీఐఎఫ్), ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఫెసిలిటేషన్, చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం(సీఐఏ) సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రదర్శనను నారాయణమూర్తి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రభుత్వ పథకాలు, వెండర్ రిజిస్ట్రేషన్ విధానాల గురించి పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించేందుకు ఎంఎస్ఎంఈ చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అందిస్తున్న సేవలు భారీ పరిశ్రమలతో సమానంగా ఉన్నాయని గుర్తు చేశారు.
కార్యక్రమంలో..తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్రెడ్డి, సీఐఏ అధ్యక్షుడు డాక్టర్ గోవింద్రెడ్డి, ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ చంద్రశేఖర్, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఎల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ఈసీఐఎల్ ఎగ్జిక్యూటీవ్ డైరక్టర్ రాంబాబు, ఎన్ఎఫ్సీ డీజీఎం శ్రీనివాసరావు, యూబీఐ ఫిల్డ్ జనరల్ మేనేజర్ సురేశ్ చంద్ర తెల్లి, కెనారా బ్యాంక్ జనరల్ మేనేజర్ అనురాధ, ఐలా చైర్మన్ రోషిరెడ్డి పాల్గొన్నారు.