మొండికేసిన స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) నుంచి బకాయిలను రాబట్టేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లాలో రూ.17 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉండగా.. గత ఐదు నెలల్లో రూ.5 కోట్లు వసూలు చేశారు. మిగతా రూ.12.44కోట్లను డిసెంబర్లోగా రాబట్టడమే లక్ష్యంగా డీఆర్డీఏ అధికారులు ముందుకెళ్తున్నారు. సదరు సంఘాల సభ్యులతో సమావేశమై రుణాల చెల్లింపుపై అవగాహన కల్పిస్తూ బకాయిలను రికవరీ చేస్తున్నారు. మరోవైపు రుణాలను రెగ్యులర్గా తిరిగి చెల్లించే సంఘాలకు అదనంగా రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.710 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.189.98 కోట్లను మంజూరు చేశారు. కాగా, జిల్లాలో మొండికేసిన స్వయం సహాయక సంఘాలు 564 ఉన్నట్లు గుర్తించిన అధికారులు బకాయిల వసూలుపై దృష్టి సారించారు.
రంగారెడ్డి, ఆగస్టు 18, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలను మంజూరు చేయడమే కాదు.. ఎస్హెచ్జీలు తిరిగి చెల్లించడంలోనూ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం చర్యలు చేపట్టింది. రుణాలు పొంది తిరిగి కిస్తుల రూపంలో చెల్లించడంలో మొండికేసిన స్వయం సహాయక సంఘాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది డిసెంబర్లోగా బకాయిలన్నింటినీ వసూలు చేసేందుకు డీఆర్డీఏ చర్యలు చేపట్టింది. మరోవైపు జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రూ.17కోట్లుగా ఉన్న బకాయిల మొత్తం ప్రస్తుతం రూ.12కోట్లకు తగ్గింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఐదు నెలల్లో రూ.5 కోట్ల బకాయిలను వసూలు చేశారు. నెలకు కోటి రూపాయల చొప్పున ఐదు నెలల్లో ఐదు కోట్ల బకాయిలను వసూలు చేశారు. మొండికేసిన స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు నిర్వహించడం, అవగాహన కల్పించడం, రుణాలు ఎప్పటికప్పుడు చెల్లించే సంఘాలకు రుణాలను మంజూరు చేయనున్నామని ఎస్హెచ్జీలకు అవగాహన కల్పిస్తున్నారు.
బకాయిలో ఉన్న సంఘాలు 564
జిల్లాలో మొండికేసిన స్వయం సహాయక గ్రామ సంఘాలు 564 ఉన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గుర్తించారు. అత్యధికంగా షాబాద్ మండలంలో 105 సంఘాలుండగా, కందుకూరు మండలంలో 44 సంఘాలు, యాచారంలో 37, తలకొండపల్లిలో 33, మొయినాబాద్ మండలంలో 32 గ్రామ సంఘాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా రూ.12.44కోట్ల బకాయిలున్నట్లు అధికారులు తేల్చారు. అత్యధికంగా షాబాద్ మండలంలో రూ.2.47 కోట్ల బకాయిలుండగా, కందుకూరు మండలంలో రూ.1.38 కోట్ల బకాయిలు మొండికేసిన సంఘాల నుంచి వసూలు చేయాల్సి ఉంది. షాబాద్ మండలంలోని రేగడి దొస్వాడ క్లస్టర్లోనే గరిష్టంగా 40 శాతం ఎన్పీఏ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఎప్పటికప్పుడు రుణాలను చెల్లించి తిరిగి రుణాలు పొందుతూ రెగ్యులర్గా ఉన్న స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధిక ప్రాధాన్యతనిస్తూ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తోడ్పాటునందిస్తున్నారు.
ఇప్పటివరకు రూ.189 కోట్ల రుణాలు మంజూరు
ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు గత ఆర్థిక సంవత్సరానికి మించి రుణాలను మంజూరు చేసేందుకు నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసే బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు స్త్రీనిధి రుణాలకు సంబంధించి రూ.750 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.189 కోట్లను మంజూరు చేశారు. ఈ ఏడాది గరిష్టంగా రూ.20 లక్షల మేర రుణాలను ఎస్హెచ్జీలకు రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లావ్యాప్తంగా 1000 స్వయం సహాయక సంఘాలు గరిష్టంగా రూ.20 లక్షల మేర రుణాలు పొందేందుకు అర్హత సాధించగా.. వీటిలో ఇప్పటివరకు 40 స్వయం సహాయక సంఘాలకు రూ.20 లక్షల చొప్పున రుణాలను మంజూరు చేశారు. రెండు, మూడు నెలల్లో 200 సంఘాలకు రూ.20 లక్షల చొప్పున రుణాలిచ్చేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్ణయించారు. జిల్లాలో 19,539 స్వయం సహాయక సంఘాలుండగా వెయ్యి సంఘాలకు రూ.20 లక్షల మేర రుణాలు, మిగతా సంఘాలకు రూ.10 లక్షలు, రూ.5 లక్షల మేర రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకర్లు కూడా రుణాలిచ్చేందుకు ముందుకొచ్చాయి. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు అధికంగా కిరాణా దుకాణాలు, గేదెలు, గొర్రెలు, మేకలను కొనుగోలు చేయడం, కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు రుణాలను తీసుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధికి సంబంధించి లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలు వాటి కార్యకలాపాలను కొనసాగించేందుకు తొలుత రూ.60వేల గ్రాంటును జాతీయ జీవనోపాధి పథకం ద్వారా ఎస్హెచ్జీలకు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రుణ పరిమితిని రూ.2లక్షల వరకు పెంచారు. జిల్లావ్యాప్తంగా 19,157 స్వయం సహాయక సంఘాలుండగా 2,17,417 మంది సభ్యులున్నారు. వీరిలో 2752 స్వయం సహాయక సంఘాలు కొత్తగా ఏర్పాటుకాగా 29,450 మంది సభ్యులున్నారు.