వికారాబాద్, జనవరి 6 : ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు జనవరి 20 వరకు వీటీజీ సెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రాంతీయ సమన్వయాధికారి డాక్టర్ శారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకై నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు.
దరఖాస్తు గడువు తేదీని జనవరి 20 వరకు పొడిగించిందని, ఇందుకు నాలుగో తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణిస్తారని, ఈ ఏడాది నాలుగో తరగతి చదువుతున్నట్లుగా బోనఫైడ్/స్టడీ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలని వివరించారు. వెబ్సైట్ tgcet.cgg.gov.in లో పూర్తి వివరాలు పొందుపర్చామన్నారు.