యాచారం, ఏప్రిల్ 21 : మండలంలో తొలిసారిగా రైలు కూత వినబడనుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఏన్నో ఏండ్ల స్థానికుల ఎదురు చూపులకు త్వరలోనే తెర పడనున్నది. డోర్నకల్-గద్వాల నూతన రైలుమార్గం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో మండలంలోని పలు గ్రామాల మీదుగా కొత్త రైల్వేలైన్ నిర్మించనున్నారు.
సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) అధికారులు ఇప్పటికే ప్రాథమిక సర్వే చేపట్టారు. యాచారం మండలంలోని తక్కళ్లపల్లి, మేడిపల్లి గ్రామాల్లో సర్వే చేసి ఎస్సీపీ నంబర్లతో కూడిన మార్కింగ్లు వేయడంతోపాటు రైలుమార్గం ఏర్పాటుకు హద్దులు ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్న కందుకూరు మండలంలోనూ అధికారులు సర్వే చేసినట్లు సమాచారం. నూతన రైల్వేలైన్పై కొంత మంది హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొంత మంది రైతులు తమ భూములు కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి రంగారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలను కలుపుతూ జోగులాంబ గద్వాల వరకు ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనికోసం గతేడాదే రైల్వేలైన్ మంజూరుకు సీఎస్ఆర్ ప్రతిపాదించింది. ఈ రైల్వేలైన్ మార్గానికి సంబంధించిన తుది సర్వే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ రైలుమార్గం ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్లు సమాచారం. డోర్నకల్ టు గద్వాల మధ్య సుమారు 11స్టేషన్లను కలుపుతూ 296 కిలో మీటర్ల రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఇందుకోసం రూ.5,300 కోట్లను వెచ్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రూ.7.40 కోట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. డోర్నకల్ నుంచి రంగారెడ్డి జిల్లాతో పాటుగా కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, బీమారం, నల్లగొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి, బూత్పూర్ వంటి ప్రధాన ప్రాంతాలను కలుపుతూ రైల్వేలైన్ను నిర్మించనున్నారు. యాచారం మండలంలోని నానక్నగర్, మేడిపల్లి, తక్కళ్లపల్లి, మాల్తోపాటు చింతపల్లి, నాంపల్లి, చండూర్, కనగల్, నల్లగొండ, కేతెపల్లి, చివ్వెంల, పాలేరు, మోతె, సూర్యాపేట తదితర గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ రైలు మార్గం నిర్మించనున్నారు. మేడిపల్లి-తక్కళ్లపల్లిలో ఎస్సీపీ 93, చింతపల్లిలో 54, మోతేలో ఎస్సీపీ 103 నంబర్లను అధికారులు మార్కింగ్ చేశారు.
నూతన రైల్వేమార్గంతో రవాణా సౌకర్యం మెరుగుపడి యాచారం మండలం మరింత అభివృద్ధి చెందనున్నది. వాణిజ్య రంగం, రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింతగా విస్తరించనున్నది. మండలానికి శంషాబాద్ ఎయిర్పోర్టు కూతవేటు దూరంలో ఉండటం, మండలంలోని కుర్మిద్ద, తాటిపర్తి, నానక్నగర్, మేడిపల్లి గ్రామాల పక్కనే ఫార్మాసిటీ విస్తరించి ఉండటంతో ఇక్కడి నుంచి రైలుమార్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. దగ్గరలోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రం కూడా ఉండడం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. పైగా అటు శ్రీశైలం హైవేతో పాటుగా ఇటు నాగార్జున సాగర్ ప్రధాన రహదారిని కలుపుతూ రైలుమార్గం వెళ్లనున్నది. వివిధ జిల్లాలను కలుపుతూ ఈ రైల్వేలైన్ ఏర్పాటు చేస్తుండడంతో ప్రయాణికులు, వ్యాపారులు తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుంటుంది.
గతంలో హైదరాబాద్ నుంచి సాగర్ మీదుగా మాచర్లకు రైల్వేలైన్ వేస్తామని అప్పటి కాంగ్రెస్ కేంద్ర మంత్రి హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చలేకపోయారు. దీంతో రైలు ఎక్కాలనే ఈ ప్రాంత ప్రజల కల కలగానే మిగిలింది. ప్రస్తుతం డోర్నకల్-గద్వాల రైల్వేలైన్కు మార్గం సుగమం కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మేడిపల్లి నక్కర్త మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు కోసం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సర్వే చేయడం సంతోషంగా ఉన్నది. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు సులభతరం కావడంతో పాటు, సమయం, ఖర్చు ఆదా అవుతుంది. అధికారులు డోర్నకల్-
గద్వాల రైలు మార్గాన్ని వీలైనంత త్వరగా నిర్మించి రైలును పట్టాలెక్కించాలి.
-కలకొండ అంజయ్య, వ్యాపారి (మేడిపల్లి నక్కర్త)