ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16 : వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024పై తహసీల్దార్లు, ఏఎల్ఎంటీఎస్లతో ఆమె ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్షించారు.
ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాను పటిష్టంగా రూపొందించాలన్నారు. 1-1-2024 నాటికి అర్హత గల ఓటర్లకు ఓటు హక్కు కల్పిస్తూ పక్కా నివేదిక తయారుచేయాలని సూచించారు. ఫారం-6, 7, 8లను బీఎల్వోల ద్వారా ఓటర్లకు అందిస్తూ కార్యాచరణ ప్రణాళికకు కృషి చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, ఓటర్ల సంఖ్య ఆధారంగా అదనంగా ఏర్పాటు చేయాల్సిన పోలింగ్ స్టేషన్లను ముందుగా గుర్తించాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటివి చేపట్టాలని ఆమె సూచించారు.
స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 ప్రకారం ఈ నెల 20 నుంచి జనవరి 5 వరకు పోలింగ్స్టేషన్ల పునర్ వ్యవస్థీకరణ చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలోని తప్పులను గుర్తించి సవరించే ప్రక్రియ చేపట్టాలన్నారు. చనిపోయిన వారి పేర్లను మరణ ధ్రువీకరణాల ఆధారంతో జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఫొటోల మార్పు తదితర పనులను వచ్చే నెల 5 వరకు నిర్వహిస్తామని.. జనవరి 6 నుంచి 22 వరకు డ్రాఫ్ట్ రోల్పై అభ్యంతరాలు, వాదనాలను స్వీకరించనున్నామని తెలిపారు.
ముఖ్య ఎన్నికల అధికారుల సూచనల ప్రకారం శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్లను నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 2న అభ్యంతరాలను డిస్పోజ్ చేయనున్నామని, ఫిబ్రవరి 6న ఆరోగ్యవంతమైన తుది ప్రచురణ కోసం కమిషన్ అనుమతికి పంపిస్తామని, వారి అనుమతి మేరకు ఫిబ్రవరి 8న తుది జాబితాను విడుదల చేస్తామని సంగీత చెప్పారు. సమావేశంలో ఆర్డీవోలు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.