ఆదిబట్ల, మే 20 : జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉదయం 10 గంటల తర్వాత నుంచే ఎండలు భగ్గుమంటున్నాయని, వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని హెచ్చరించారు. నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బకు గురై ఆసుపత్రిపాలు కావాల్సి రావచ్చని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గకుండా రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలని సూచించారు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, పరిశుభ్రత పాటించడం, రెండు పూటలా స్నానం చేయడం మంచిదన్నారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకూడదని వైద్యశాఖ హెచ్చరించింది. బయటకు వెళ్లాల్సి వస్తే టోపీ, స్కార్ప్ వాడాలని, వెంట తాగునీరు బాటిల్ తీసుకెళ్లాలని సూచించారు.
వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి చల్లని నీటితో శరీరాన్ని తుడవాలని తెలిపారు. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలని, అపస్మారక స్థితిలో ఉంటే నీరు తాగించరాదని సృష్టం చేశారు. వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు. మద్యం సేవించడం, రోడ్లపై లభించే రంగు పానీయాలు తాగడం, నలుపు రంగు మరియు మందమైన దుస్తులు ధరించడం మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరో 15 రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు.