వికారాబాద్, ఫిబ్రవరి 28 : జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గిడ్డంగి ఆవరణలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
మహబూబ్ నగర్ శాసనమండలి ఎన్నికను పురస్కరించుకొని జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉందన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల్ మండలాలకు ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. మహబూబ్నగర్ శాసనమండలి ఎన్నికకు సంబంధించి కొడంగల్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఈ కేంద్రంలో 55 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి, షెడ్యూల్ పత్రాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలనపై ప్రతినిధులకు వివరించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో ఎం.సుధీర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.