ఇబ్రహీంపట్నం రూరల్, జూలై 30 : క్యాన్సర్ కంటే భయంకరమైన గాలికుంటు వ్యాధి నుంచి మూగ జీవాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రతిఏటా రెండుసార్లు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేస్తున్నది. అందులో భాగంగానే నేటి నుంచి జిల్లాలోని 2,40 లక్షల ఆవులు, ఎద్దులు, 1,25 లక్షల గేదెలు, దూడలకు గాలికుంటు వ్యా ధి, నట్టల నివారణ, ముద్ధచర్మ వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేసేందుకు రంగారెడ్డి జిల్లాలోని పశుసంవర్ధకశాఖ సిద్ధమైనది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నుంచి మూగ జీవాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది.
ఇందుకోసం జిల్లాలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి టీకాలను వేయనున్నది. ప్రతి ఆరు నెలలకోసారి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను రైతులు వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. గాలికుంటు వ్యాధి టీకాలు వేయించకపోతే కలిగే అనర్థాలను రైతులకు వివరించి వారి లో చైతన్యం తీసుకొస్తున్నారు. జిల్లాలోని 27 మండలాల్లోని అన్ని గ్రామాల్లో గాలికుంటు వ్యాధి టీకాలు వేసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు 52 బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు నెల రోజు ల పాటు టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగనున్నది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు జిల్లా పశువైద్యాధికారి అంజిలప్ప తెలిపారు.
వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి
ఆవులు, గేదెలు, ఎద్దులు, దూడలకు సీజనల్ వ్యాధులు సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం నేటి నుంచి ఉచితంగా గాలికుంటు, ముద్ధ చర్మ వ్యాధి, నట్టల నివారణ టీకాలను పంపిణీ చేయనున్నది. గ్రామాలకు వచ్చే అధికారులకు రైతులు సహకరించి తమ ఆవులు, గేదెలు, దూడలు, ఎద్దులు, ఆవుదూడలకు టీకాలు వేయించాలి.
-అంజిలప్ప, రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి