కొడంగల్, మార్చి 11 : పట్టణ కేంద్రంలోని సివిల్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఉందని సంతోషించాలో.. వైద్యులు, అటెండర్లు అందుబాటులో లేక వైద్యసేవలకు తలెత్తుతున్న ఇబ్బందులకు అందోళన చెందాలో అర్థం కావడం లేదని కిడ్నీ సంబంధిత రోగులు పేర్కొంటున్నారు. స్థానిక ఆసుపత్రిలో గత ప్రభుత్వం డయాలసిస్ సెంటర్ను మంజూరుచేసి ఏర్పాటు చేసింది. ఆనాటి నుంచి స్థానిక కిడ్నీ సంబంధిత రోగులు చికిత్స పొందుతున్నారు.
నియోజకవర్గ పరిధిలో గతంలో 35 మంది కిడ్నీ సంబంధిత రోగులు ఉండేవారని, పరిగిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం కావడంతో ఆ ప్రాంతాలవారు అక్కడే చికిత్స తీసుకుంటున్నట్లు కొడంగల్ డయాలసిస్ సెంటర్ డీఈవో రమేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం డయాలసిస్ సెంటర్లో 27 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతి రోజూ 15 మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
గతంలో సీహెచ్సీ ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రిగా వైద్యసేవలను అందించేది. ఆ తరువాత గత ప్రభుత్వం 50 పడకల ఆసుపత్రిగా ఆప్గ్రేడ్ చేసి అన్నింటా సౌకర్యాలతో కూడిన నూతన భవనాన్ని నిర్మించింది. ఎక్స్రే, రక్త నమూనా పరీక్షలు, డయాలసిస్ సెంటర్తో పాటు ఆపరేషన్ థియేటర్ మంజూరు చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. డయాలసిస్ ప్రారంభానికి ముందు స్థానిక కిడ్నీ బాధితులు హైదరాబాద్, మహబూబ్నగర్, తాండూరు వంటి పట్టణాల్లో వేలాది రూపాయల ఖర్చుతో, వ్యయప్రయాసలకు గురవుతూ చికిత్స పొందేవారు.
కిడ్నీ సంబంధిత రోగుల బాధలు అప్పటి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో మొరపెట్టుకోవడంతో, అప్పటి మంత్రి హరీశ్రావుతో సంప్రదించి కొడంగల్ సివిల్ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్కు అనుసంధానం చేసి మరిన్ని వైద్యసేవలు అందుకునేలా కృషి చేశారు. ఆనాటి నుంచి ఆసుపత్రి అన్నింటా సౌకర్యాలతో మెరుగుపడినప్పటికీ వైద్యుల కొరతతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం, అత్యవసర పరిస్థితి ఉంటే ఆసుపత్రి సిబ్బంది తాండూరు జిల్లా ఆసుపత్రికి పంపించడంతో బాధితులు చాలా వరకు బాధలను ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సీఎం కావడంతో ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య నియామకాలు జరిగి స్థానికంగానే కార్పొరేట్ వైద్య సేవలు అందుకోవచ్చని సంబురపడ్డారు.
అనుకున్నట్లుగానే కొడంగల్ ఆసుపత్రిని 220 పడకల ఆసుపత్రిగా, వైద్య కళాశాల ఏర్పాటుతో పాటు ఆసుపత్రిని టీచింగ్ ఆసుపత్రిగా తీర్చిదద్దడంతో నియోజకవర్గ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతమున్న ఆసుపత్రిలో వైద్యుల కొరత మాత్రం అదేవిధంగా ఉందని, ఉన్న వైద్యులు కూడా ఆయా సందర్భాల్లో అందుబాటులో లేకపోవడం ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నదని రోగులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 220 పడకల ఆసుపత్రి ఏ విధంగా ఉంటుందో..? వైద్య సేవలు ఏ విధంగా అందుబాటులో ఉంటాయోనని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సీఎం ఇలాఖాలోని డయాలసిస్ సెంటర్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా నెఫ్రాలజీ డాక్టర్ను నియమించకపోవడం చాలా బాధాకరంగా ఉందని రోగులు వాపోతున్నారు. డయాలసిస్ టెక్నీషియన్లతోనే వైద్య సేవలు సరిపెట్టుకోవాల్సి వస్తున్నదని, వారి పరిజ్ఞానం మేరకు కొంత వరకు మంచి వైద్య సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులు అందుబాటులో ఉన్నప్పుడే ఆసుపత్రికి వచ్చే రోగులకు సగం రోగం తగ్గిపోతుందని పేర్కొంటున్నారు.
ఉన్నంత వరకు డయాలసిస్ టెక్నీషియన్ వైద్యసేవలు అందిస్తున్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలిస్తున్నారని, ఆ సమయంలో రోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురి కావడంతో పాటు వ్యయప్రయాసలకు గురి కావాల్సి వస్తున్నదని ఆరోపిస్తున్నారు.
కొడంగల్ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించుకుంటే ఓ విధంగా రిపోర్టులు.. మహబూబ్నగర్ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించుకుంటే మరో విధమైన రిపోర్టులు చాలా వరకు తేడాలు వస్తున్నాయని రోగులు ఆరోపించారు. ఇటువంటి వ్యత్యాసాలను పరిశీలిస్తే సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నదని, ఏది సరైందో నిర్ణయించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. బాధితుల బాధలను గమనించి సీఎం సార్ కొడంగల్ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
కొంత కాలంగా స్థానికంగా డయాలసిస్ సేవలను అందుకుంటున్నాను. అప్పట్లో డయాలసిస్ సెంటర్ అందుబాటులో లేని సమయంలో మహబూబ్నగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి వేలకు వేల ఖర్చుతో చికిత్స చేయించుకున్నాను. స్థానికంగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కావడంతో ఆనాటి నుంచి ఇక్కడే చికిత్స పొందుతున్నాను. నెఫ్రాలజీ వైద్యులు అందుబాటులో లేకపోవడం చాలా ఇబ్బందిగా మారింది. 5,6 సార్లు ఫిస్తులా ఫెయిల్ అయ్యి ఆందోళన చెందాం. ప్రస్తుతమున్న టెక్నీషియన్లు వారికున్న పరిజ్ఞానంతో వైద్యం చేస్తున్నారు. కానీ సంబంధిత వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఇటువంటి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. సీఎం నియోజకవర్గంలో ఇటువంటి ఇబ్బందులు ఎదురైతే రోగుల పరిస్థితి ఏవిధంగా ఉంటుంది. ముఖ్యమంత్రి స్పందించి అసుపత్రిలో పూర్తి స్థాయి వైద్యుల నియామకాలు చేపట్టాలి.
– ఫకీరప్ప, కిడ్నీ బాధితుడు, అంగడిరైచూర్, కొడంగల్
నెఫ్రాలజీ వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల డయాలసిస్ చికిత్సకు తీవ్రంగా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తున్నది. టెక్నీషియన్లతోనే చాలా కాలంగా చికిత్సను పొందుతున్నాం. సంబంధిత వైద్యులు లేకపోవడం వల్ల పూర్తి స్థాయి వైద్య చికిత్సను అందుకోలేకపోతున్నాం. అటెండర్లు కూడా అందుబాలులో లేకపోవడం మరింత ఇబ్బంది ఏర్పడుతున్నది. మొదటి అంతస్తులో చికిత్స పొందేందుకు నడవలేకపోతున్నాం. అటెండర్ తప్పనిసరి. సొంతవారు లేని వారికి మరింత ఇబ్బంది. రక్త పరీక్షల్లో కూడా ఇక్కడికి మరో ఆసుపత్రికి రిపోర్టులు చాలా తేడా వస్తున్నాయి. దాంతో మరింత ఆందోళనకు గురౌతున్నాం. వైద్యులు అందుబాటులో ఉంటే స్థిమితంగా చికిత్సను పొందవచ్చు.
– ఉమామహేశ్వర్రెడ్డి, కిడ్నీ బాధితుడు, హస్నాబాద్, కొడంగల్
డయాలసిస్ సెంటర్ ఏర్పాటు నుంచి కూడా నెఫ్రాలజీ వైద్యుల నియామకం జరగలేదు. టెక్నీషియన్స్తోనే చికిత్స కొనసాగుతున్నది. గతంలో ఇక్కడ 35 మంది వరకు చికిత్స అందుకునేవారు. పరిగిలో సెంటర్ ఏర్పాటు కావడంతో కొంత మంది అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 27 మందికి.. రోజువారీగా 15 మందికి చికిత్స అందిస్తున్నాం.
– రమేశ్, డయాలసిస్ సెంటర్ డీఎంవో, సీహెచ్సీ ఆసుపత్రి, కొడంగల్