ఖైరతాబాద్, అక్టోబర్ 6 : దేవీ శరన్నవరాత్రోత్సవాలు విజయదశమితో ముగిశాయి. నగరంలో వందలాదిగా అమ్మవారి విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచే అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఘట్టం ప్రారంభమైంది. నెక్లెస్రోడ్ పీవీ మార్గ్లోని పీపుల్స్ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్, జలవిహార్ ప్రాంతాల్లో నిమజ్జన ఘాట్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. సాగర్లో నిమజ్జనమైన ప్రతిమల అవశేషాలను హెచ్ఎండీఏ తొలగిస్తుండగా.. ఒడ్డున పడిన వాటిని జీహెచ్ఎంసీ సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నది.
ఎప్పటికప్పుడు తొలగిస్తూ..
గత సంవత్సరంతో పోల్చితే వినాయక విగ్రహాలతో సమానంగా ఈ ఏడాది పెద్దఎత్తున అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ నెక్లెస్రోడ్ పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజాలో ఆరు క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్లో నాలుగు, జలవిహార్ బేబీపాండ్లో మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసింది. దానికి తోడుగా బాబ్ కాట్తో అవశేషాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు 300 మంది సిబ్బందిని కేటాయించింది. వ్యర్థాలను తీసేందుకు 10కి పైగా టిప్పర్లు, బాబ్ కాట్ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు నాలుగు క్రేన్లను నామమాత్రంగా వినియోగిస్తుండగా.. మిగతా వాటి ద్వారా ముమ్మరంగా నిమజ్జనం చేస్తున్నారు.
24/7 నిమజ్జనాలు జరుగుతాయి..
దసరాకు ముందే అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ ఏడాది అధిక సంఖ్యలో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అందుకు అనుగుణంగా క్రేన్లు, బాబ్ కాట్, టిప్పర్లు, సిబ్బందిని సమాయత్తం చేశాం. పగలు, రాత్రి తేడా లేకుండా విగ్రహాలు వస్తాయి. ఈ నేపథ్యంలో 24/7 గంటలు షిఫ్టుల వారీగా సిబ్బందితో పనిచేయిస్తున్నాం.
-డాక్టర్ భార్గవ్ నారాయణ, ఏఎంవోహెచ్, జీహెచ్ఎంసీ