సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): కోకాపేట నియో పోలీస్ భారీ లేఅవుట్లో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఐటీ కారిడార్లోనే అతి పెద్ద బహుళ వినియోగ జోన్గా హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ (హెచ్ఎండీఏ) ఈ లేఅవుట్ను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తోంది. లేఅవుట్ అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ లేఅవుట్లో మొదటి దశలో ప్లాట్లకు ఆన్లైన్ వేలం నిర్వహించగా, విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకోవడంతో మిగతా ప్లాట్లను సైతం రెండో దశలో వేలం వేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు షెడ్యూలు ఖరారు చేశారు. మరో వారం రోజుల్లోనే సుమారు 64 ఎకరాలను ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా విక్రయించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఆన్లైన్ వేలం ప్రక్రియను నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. మొత్తం 6 నుంచి 10 ప్లాట్లు ఉండగా, అందులో ఒక్కో ప్లాటు విస్తీర్ణం 5 నుంచి 8 ఎకరాలతో ఉంటుందని అధికారులు తెలిపారు.
కోకాపేట నియో పోలీస్ లేఅవుట్లో మొదటి దశ వేలాన్ని 2021 జూలైలో నిర్వహించారు. ఇందులో మొత్తం 49 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను విక్రయానికి ఉంచారు. వీటిని కొనుగోలు చేసేందుకు సుమారు 60 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. ఎకరం కనీస ధర రూ. 25 కోట్లు నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకున్నారు. మొత్తం వేలం ప్రక్రియలో సరాసరిగా ఎకరం రూ. 40.05 కోట్ల ధర పలికితే, గరిష్ఠంగా ఎకరానికి రూ.60కోట్ల దాకా పలికింది. మొదటి దశలో జరిగిన వేలంలో రూ 2000.37 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. ఈ వేలంతో హైదరాబాద్లోనే అత్యంత విలువైన భూములుగా గుర్తింపు వచ్చింది. ఇప్పటికే కోకాపేటలో 58 అంతస్థుల వరకు వ్యాపార, వాణిజ్య, నివాస భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా రెండో దశలో 64 ఎకరాల దాకా వేలం నిర్వహించనున్నట్లు సమాచారం.
గ్రేటర్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాంటి ఓఆర్ఆర్ మీదుగా కోకాపేట నియోపోలీస్ లేఅవుట్తో అనుసంధానిస్తూ ట్రంపెట్ను హెచ్ఎండీఏ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఓఆర్ఆర్ ప్రధాన రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కాగా రెండు చివరలా పైకి వెళ్లే , కిందకు దిగే మార్గాలను నిర్మించాల్సి ఉంది. ట్రంపెట్ నిర్మాణం పూర్తయితే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ మీదుగా 20 నిమిషాల వ్యవధిలోనే కోకాపేట నియోపోలీస్ లేఅవుట్కు చేరుకునేలా మార్గాన్ని అత్యాధునికంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి లేఅవుట్ అభివృద్ధి పనులను పూర్తి చేసే లక్ష్యంతో హెచ్ఎండీఏ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.