పరిగి : పేదరిక నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. శుక్రవారం దళితబంధు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇల్లు, భూమి కొనుగోలు తప్ప ఇతర వ్యాపారాలు ఏవైనా అనుభవం మేరకు చేసుకోవచ్చని తెలిపారు. మొబైల్ షాపు, సీసీ కెమెరాలు, డీటీపీ, జీరాక్స్, ఫొటోగ్రఫీ, పౌల్ట్రీ, పాడి గేదెలతో పాల వ్యాపారాలను ఎంచుకోవాలన్నారు. అవసరమైన లబ్ధిదారులకు శిక్షణ సైతం ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా వికారాబాద్, నవాబుపేట మండలాలకు చెందిన 10 మంది లబ్ధిదారులతో వారు ఎంచుకున్న వ్యాపార వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మంది ట్రాక్టర్ల కొనుగోలుపై మొగ్గుచూపగా ఒక లబ్దిదారుడు పాడి గేదెల ద్వారా పాల వ్యాపారం చేస్తానని కలెక్టర్కు తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ పాడి గేదెల పేడతో ఆర్గానిక్ కూరగాయలు పండించాలని, దానికి అవసరమైన కూరగాయల పందిళ్లను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయాల్సిందిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి సూచించారు. చాలామంది లబ్దిదారులు ఒకే రకమైన వ్యాపారాలు చేస్తే లాభాలు రావని, వివిధ రకాల వ్యాపారాలు, యూనిట్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కలెక్టర్ చెప్పారు.
అధికారులు, ఏపీఎంలు గ్రామాలను సందర్శించి లబ్దిదారులకు అనువైన వ్యాపారాల కోసం సలహాలు, సూచనలు అందించి విజయవంతమయ్యేలా సహకరించాలని ఆదేశించారు. అవసరమైన సహాయం కోసం వికారాబాద్, నవాబుపేట ఏపీఎంల ఫోన్ నంబర్లు తీసుకొని, ఫోన్ చేసి సలహాలు పొందాల్సిందిగా కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, వికారాబాద్, నవాబుపేట ఎంపీడీవోలు సత్తయ్య, సుమిత్రమ్మ, వికారాబాద్ తాసిల్దార్ షర్మిల, ఏపీఎంలు పాల్గొన్నారు.