కడ్తాల్, మార్చి 14: పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని పాడి రైతులు డిమాండ్ చేశారు. పాల బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన విజయ డెయిరీ పాల సేకరణ కేంద్రం నిర్వాహకులు, పాడి రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నెలల నుంచి పాడి రైతులకు పాల బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పదిహేను రోజులకొకసారి చెల్లించాల్సిన పాల బిల్లులు అరవై రోజులు దాటుతున్నా రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో పశుదాణాను కొనుగోలు చేయలేకపోతున్నామని రైతులు వాపోయారు. పాడి రైతుల కోసం ప్రభుత్వం రూ.200 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలన్నారు. అదే విధంగా పాడి రైతులకు పెండింగ్లో ఉన్న లీటర్కు రూ.4 పాల ప్రోత్సాహక బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు.
అధికారంలోకి రాగానే పాల ప్రోత్సాహక ధరను రూ.5 పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతున్నా, ఎలాంటి ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం సకాలంలో పాల బిల్లులు చెల్లించకపోతే నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడారి రామకృష్ణ, ముత్తి రంగయ్య, నర్సింహారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, బాచిరెడ్డి అశోక్రెడ్డి, సిద్ధిగారి కుమార్, సిరిగిరి సాయిప్రభు, కాకర్ల సత్యం, నరేశ్, నార్లకంటి శేఖర్, గురిగళ్ల శంకరయ్య, గిరిధర్, గురిగళ్ల రమణ, రాజేశ్, రంగా, గణేశ్, లింగం, శ్రీశైలం పాల్గొన్నారు.