పాల ఉత్పత్తులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నేడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పాడి పశువులను పెంచుతున్నారు. తమ ఇంటి అవసరాలకు సరిపడా పాలను సమకూర్చుకుంటూ మిగతా విక్రయించి ఉపాధి పొందుతున్నారు. అతి తక్కువ శ్రమతో అధిక లాభాలు గడిస్తున్నారు. నేడు గ్రామీణ యువత పెద్దఎత్తున పాడి పరిశ్రమవైపు మొగ్గు చూపుతూ.. ఎక్కడ చూసినా ఆవులు, గేదెలను పెంచుకుంటూ పాలను విక్రయించి ఉపాధి పొందుతున్నారు.
ఒకప్పుడు 20 నుంచి 30 పశువులతో నిండుగా కనిపించిన పశువుల కొట్టాలు, చావిళ్లు నేడు ఖాళీగా శిథిలావస్థలో కనిపిస్తున్నాయి. అనేక కారణాల వల్ల కూలీల లభ్యత తగ్గి, పాడి పశువుల నిర్వహణ, నమ్మకమైన పనివాళ్ల కొరతను పాల ఉత్పత్తి రంగం ఎదుర్కొంటూ వస్తున్నది. కాని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్రమలో సమూల మార్పులు తీసుకువస్తున్నది. రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువగా అలిసిపోకుండా ప్రత్యేక యంత్ర పరికరాల సహాయంతో శ్రమను తగ్గించేందుకు ప్రత్యేకంగా కృషిచేస్తున్నది. రైతులు ముఖ్యంగా పాడి పరిశ్రమలో శ్రమను తగ్గించేందుకు తీసుకోవాల్సిన నూతన విధానంపై ప్రత్యేక కథనం.
– ఇబ్రహీంపట్నంరూరల్
యజమాని ఇంటికి దగ్గరగానే కాకుండా ఇంట్లో రోజువారీ గృహ కార్యక్రమాలను నిర్వహిస్తున్న కుటుంబసభ్యుల దృష్టిలో పశువులన్నీ ఉండేలా, మంచి గాలి, వెలుతురుతోపాటు, సులువుగా, శుభ్రంగా ఉండేలా పాకలు పరిసరాల కంటే కనీసం 1 1/2-2 అడుగుల ఎత్తుగా నిర్మించుకోవాలి. కొంత ఖర్చు ఎక్కువైనప్పటికీ సిమెంట్ కాంక్రీటుతో పటిష్టంగా ఏర్పర్చుకోవాలి. రెండు అడుగుల వెడల్పు మేత తొట్టి, పశువు పొడుగుకు అనువైన 5-6 అడుగుల పొడవైన 4-5 అడుగుల వెడల్పు నేల, తోక వైపు 1/2-1 అడుగుల వెడల్పు చిన్న కాలువను నిర్మించాలి. ముందు నుంచి వెనుకకు ఆరంగుళాల వాలుతో పశువుల మలమూత్రాలు నేరుగా కాల్వలో పడేలా నిర్మించుకుంటే పశువుల పాకలోని 70-80 శాతం నేల ఎప్పుడూ శుభ్రంగా పొడిగా ఉండే అవకాశముంటుంది.
మేత, దాణా, వ్యర్థాలను సులువుగా ట్రాలీలతో తరలించేందుకు వీలుగా ఎక్కడా మెట్లు, ఇతర అడ్డంకులు లేకుండా చూడాలి. నేలను సులువుగా, వేగంగా, సమర్థవంతంగా శుభ్రపర్చుటకు తగిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే పవువుల పాకలను పశుగ్రాసాల సాగు భూమికి లేదా గడ్డివాములకు, హైడ్రోపోనిక్ గ్రాసాలు లేదా అజొల్లా సాగు ప్రదేశాలకు సమీపంలో ఏర్పాటు చేసుకోవాలి. పశుగ్రాస సాగుకు దగ్గరలో సొంత భూమి లేకపోతే పక్కనే ఉన్న ఇతరుల భూమినైనా కౌలుకు తీసుకుని ఏర్పాట్లు చేసుకోవాలి. పశువుల వ్యర్థాలు, పశుగ్రాసాల సాగు రవాణా వేగవంతం, సులభతరం కాగలవు. పశువుల పాకల సమీపంలో పశువులను సులువుగా నిర్బంధించి ఆరోగ్య పరీక్షలు, టీకాలు, మందులు పట్టించుటకు ఇనుముతో కాకపోయినా కర్రలతో అయినా బోనును నిర్మించుకుంటే ఇతరుల సహాయాన్ని కోరాల్సిన అవసరం తగ్గుతుంది.
పశుగ్రాసాల వృథాను తగ్గించి, పశువులు వాటిని సులువుగా జీర్ణం చేసుకుని ఎక్కువ ప్రయోజనం పొందుటకు విద్యుత్తో నడిచే గడ్డికోత మిషన్లను ఏర్పాటు చేసుకుంటే మంచిది. బోరు బావి నుంచి నీటిని తోడటానికి ఏర్పర్చుకున్న మోటారుకే మరొక అదనపు కనెక్షన్ను ఏర్పాటు చేసి, దానితో గడ్డికోత మిషన్ను కూడా నడపగలిగితేనే ఒకే సమయంలో తక్కువ శ్రమ, తక్కువ విద్యుత్ వినియోగంతో రెండు పనులు పూర్తవుతాయి.
పరిమితంగా అత్యవసరంలో మాత్రమే పశువులు తలదాచుకునేలా చిన్న పాకలు, షెడ్లతోపాటు అనుబంధంగా కొంత విశాలమైన ఆవరణలో చెట్ల నీడను ఏర్పాటు చేయగలిగితే ఈ నీడలో పశువులు స్వేచ్ఛగా తిరుగుతూ ఆరోగ్యంగా ఉంటాయి. ఇందువల్ల పాకలను శుభ్రపరిచే అవసరం మూడు లేదా నాలుగో వంతుకు తగ్గుతుంది. ఈ ఆవరణలో ఒక మూల తాగునీరు, మరో మూల మేతను ఏర్పాటు చేస్తే వాటికి తగినంత నడక, వ్యాయామం కూడా ఉంటుంది.
పాకలు, షెడ్లకే పరిమితమైన పశువుల్లో కంటే ఇలాంటి ఆవరణల్లో దూరం, దూరంగా స్వేచ్ఛగా సంచరించే పశువుల్లో పొదుగు వాపు వంటి వ్యాధులు, ఇతర పరాన్నజీవులు వృద్ధి చెందే అవకాశాలు కూడా తక్కువ. ఈ ఆవరణలో మామిడి, మునగ, నేరేడు, వేప, సుబాబుల్ వంటి చెట్లను పెంచి పశువులకు చల్లని నీడతో పాటు విపత్తు సమయాల్లో ప్రత్యామ్నాయ మేతలు కూడా ముఖ్యంగా దూడలకు లభ్యమౌతాయి. ఈ రోజుల్లో పశువులను బయటకు మేత కోసం తీసుకెళ్లేవారు ఉండటంలేదు. ఉన్నా బయట వాటికి ప్రయోజనం అంతగా ఉండటంలేదు. కావున, ఈ ఏర్పాటు చేసుకుంటే ఎంతో బాగుంటుందని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.
చీపుళ్లు, తట్టలు, చేతులు వాడకుండా పశువుల వ్యర్థాలను పొడవైన కర్రలతో బిగించిన రబ్బరు దంతెలు, పారలతో ట్రాలీల్లోకి ఎత్తి సులువుగా దూరంగా తొలగించుకునే ఏర్పాటు చేసుకోవాలి. పాకలను, పశువులను కడగడానికి మోటారుకు రబ్బరు పైపును బిగించిన నాజిల్ ద్వారా వచ్చే నీటితో అత్యంత వేగంగా, సులువుగా శుభ్రపర్చుకోవచ్చును. పాత పద్ధతిలో ఒక పశువును కడిగే సమయంలో సులువుగా 5 నుంచి 6 పశువులను ఈ పద్ధతిలో శుభ్రపర్చుకోవచ్చును. వేసవితాపం సమయంలో ఈ పైపులతో సులువుగా పశువులన్నింటినీ క్షణాల్లో చల్లని నీటితో తడపవచ్చును.
ఎత్తులో నిర్మించిన వాటర్ ట్యాంకులో కనీసం 3-4 రోజుల అవసరాలకు సరిపోయే నీటిని నిల్వ చేసుకుని పైపుల ద్వారా పశువులకు అందుబాటులో సరఫరా చేసే ఏర్పాటు వల్ల నీటి సరఫరా శ్రమ చాలా వరకు తగ్గుతుంది. ఒక బేసిన్పైన అమర్చిన కుళాయిని పశువు తన ముట్టెను ఆనిస్తే తాగడానికి వీలుగా సరఫరా అయ్యే పాత్రలు నేడు చాలాచోట్ల అందుబాటులో ఉన్నాయి. వీటిని పశువుల పాకలో గోడలకు, మేత తొట్లకు, స్తంభాలకు బిగించుకోవచ్చును. ఇందువల్ల పశువులకు పరిశుభ్రమైన తాగునీరు అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది.
ఇప్పుడు పాడి నిర్వహణ చాలా వరకు వయస్సు మళ్లిన వారిపైనే ఉంది. అనారోగ్య, వృద్ధాప్య సమస్యల వల్ల వృద్ధులు, యువత కూడా పాలు పిండలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పాడి రైతులకు ప్రభుత్వాలు సబ్సిడీపై పాలు పిండే యంత్రాలను కూడా అందిస్తున్నాయి. నాలుగైదు పశువులు కలిగిన ప్రతి రైతుకు ఈ పాలు పిండే యంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇరుగు, పొరుగు రైతులు సమష్టిగా కూడా ఈ యంత్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా పాల సేకరణ చేసే సంచార పాల వ్యాపారులే తమ వాహనానికి అమర్చుకుని పాలు పిండే యంత్రంతో పశువుల వద్దకే వచ్చి పాలు పిండుకుని కొనుగోలు చేసుకునే ఏర్పాటును కూడా ప్రోత్సహించవచ్చును.
విద్యుత్తోనే కాక ట్రాక్టర్ ఇంజిన్తో కూడా నడిచే పాల యంత్రాలు నేడు అందుబాటులో ఉన్నాయి. పాల సహకార సంఘాలు ఈ విషయంలో తమకు అనువైన విధానాలను గ్రామస్థాయిలో అమలు చేయవచ్చు. చేతులతో పిండే పాల కంటే యంత్రాలతో పిండిన పాలే ఎక్కువ శుభ్రంగా ఉండి ఎక్కువ సేపు నిల్వ ఉంటాయి. అవసరమైతే చేతులతో పాలు పిండటానికి కుటుంబసభ్యులందరూ సిద్ధంగా ఉండాలి.
నేడు ప్రతి ఒక్కరూ పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. నిరుద్యోగ యువత ఉపాధి పొందడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై రుణాలు అందజేస్తున్నది. ఆధునిక టెక్నాలజీతో అధిక శ్రమ తగ్గించే రకరకాల యంత్రాలతో ఈ పశువులను సాకేందుకు అనేక అవకాశాలున్నాయి. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీతోపాటు శ్రమను తగ్గించే యంత్రాల ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పశువుల పాకను సరైన రీతిలో నిర్మించుకుని ముందుకు సాగాలి.
– అంజిలప్ప, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి