బొంరాస్పేట, ఫిబ్రవరి 28 : దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదని లగచెర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాలకు చెందిన రైతులు స్పష్టం చేశారు. ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం మూడు గ్రామాలకు చెందిన రైతుల భూములను తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, కొందరు అధికారులు వచ్చి ఇటీవల రైతుల భూములను పరిశీలించారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫార్మా కంపెనీలు తమకు వద్దే వద్దని, ఏండ్ల నుంచి తాము భూములు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని రైతులు తెలిపారు. ఈ మేరకు బుధవారం మూడు గ్రామాలకు చెందిన రైతులు కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డికి, దుద్యాల తహసీల్దార్ దానయ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం హకీంపేట కూడలిలో రైతులు ధర్నా నిర్వహించారు. ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు.