హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో నిరంతరాయంగా విద్యుత్ను అందించడానికి చేసిన ఏర్పాట్లలో అది కీలకమైన అండర్ గ్రౌండ్ 220 కేవీ కేబుళ్లను రోడ్డు వెడల్పు పనుల్లో జీహెచ్ఎంసీ కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిని మరమ్మతుకు కనీసం నెల రోజుల సమయం, సుమారు రూ. 1.5 కోట్లు అవుతుంది. ఈ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ప్రత్యామ్నాయం ఎలా ? అని ట్రాన్స్కో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో తమకు సమాచారం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టరు నుంచి రూ. 1.5 కోట్లను వసూలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు ట్రాన్స్కో డైరెక్టర్ లేఖ రాశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోనే అత్యంత వినూత్నంగా రాయదుర్గం 400 కేవీ సబ్ స్టేషన్ను నిర్మించారు. నగరంలో 24 గంటల నిరంతరాయ విద్యుత్తో పాటు మాదాపూర్, జూబ్లీ హిల్స్, మియాపూర్, గచ్చిబౌలి, శివరాంపల్లి, ఎర్రగడ్డ, షాపూర్నగర్ తదితర సబ్ స్టేషన్లకు రాయదుర్గం సబ్స్టేషన్తో లింక్ ఉంది. ఈ సబ్స్టేషన్ నుంచి వివిధ సబ్స్టేషన్లకు 220 కేవీ, 132 కేవీ కేబుళ్లు లింక్ అయి ఉన్నాయి. ఈ కేబుళ్ల డయాగ్రాంలు, మ్యాపులు జీహెచ్ఎంసీతోపాటు లైన్ డిపార్ట్మెంట్లన్నింటికీ ట్రాన్స్కో పంపించింది.
అయితే ఫిబ్రవరి 2న ఐకియా సమీపంలో రోడ్డు వెడల్పు పనులను చేపట్టిన ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఎలాంటి సమాచారం లేకుండా జేసీబీతో పనులు చేయడంతో కీలకమైన 220 కేవీ కేబుళ్లు ధ్వంసమయ్యాయి. ఇది దృష్టికి రాగానే ట్రాన్స్కో ఉన్నతాధికారులు సందర్శించి.. ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు.
అయితే ఇప్పుడు ఆ కేబుళ్లుమరమ్మతు చేయడానికి సుమారు రూ.1.5 కోట్లు ఖర్చవుతుంది. తమకు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టిన కాంట్రాక్టరుపై చర్యలు తీసుకుని, మరమ్మతుకు అయ్యే మొత్తాన్ని వసూలు చేయాల్సిందిగా కోరుతూ ట్రాన్స్కో డైరెక్టర్ జగత్రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్కు లేఖ రాశారు. ఆ లేఖలో ఆ కేబుళ్లు ఎంతటి కీలకమైనవో స్పష్టం చేశారు.