వికారాబాద్, డిసెంబర్ 2, (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు నేడు తెరపడనుంది. జిల్లాలోని నాలుగు నియోజవర్గాల్లో గెలుపెవరిదనేది నేడు తేలనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి పరిగి పట్టణంలోని ఏఎంసీ గోదాంలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 300 మంది పోలీస్ సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడంతోపాటు ఓట్ల లెక్కింపు కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అంతేకాకుండా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ర్యాలీలు, జులూస్ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారు.
అయితే మధ్యాహ్నంలోగా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారనేది స్పష్టత రానుంది. అయితే తొలుత కొడంగల్ నియోజకవర్గ ఫలితం వెలువడనుండగా,…చివరిగా పరిగి నియోజకవర్గ ఫలితం వెలువడనుంది. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 61 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్తోపాటు బయట ఊహాగానాలు వేరుగా ఉన్నప్పటికీ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులదే గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థులు, నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నేడు ఉదయం 8 గంటల నుంచి నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, సర్వీస్ ఓట్లను లెక్కించే ప్రక్రియ ప్రారంభంకానుంది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుండగా, ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున 56 టేబుళ్లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను బట్టి రౌండ్లను నిర్ణయిస్తారు.
జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గంలో 284 పోలింగ్ కేంద్రాలుండగా, పరిగి నియోజకవర్గంలో 305, తాండూరులో 269, కొడంగల్ 275 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. తాండూరు నియోజకవర్గంలో తక్కువ పోలింగ్ కేంద్రాలున్నప్పటికీ పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్న దృష్ట్యా మొదట కొడంగల్ నియోజకవర్గ ఫలితం వెలువడనుంది. అదేవిధంగా పరిగి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు అధికంగా ఉన్నందునా,.. ఫలితాలు కూడా చివరిగా రానుంది. పరిగి నియోజకవర్గంలో ఎవరూ గెలుస్తారనేది 22 రౌండ్లు, వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 20 రౌండ్లకు, తాండూరు నియోజకవర్గానికి 19 రౌండ్లకు, కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి 19 రౌండ్లకు ఫలితాలు వెల్లడవనున్నాయి.
ఏ నియోజకవర్గంలో ఎవరూ గెలుస్తారనేది మధ్యాహ్నం వరకు స్పష్టత రానుంది. అదేవిధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం అబ్జర్వర్ల పర్యవేక్షణలో జరుగనుంది. ఓట్ల లెక్కింపులో ఒక్కో టేబుల్ వద్ద ఒక సీఎస్, ఇద్దరు సీఏలు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుళ్లలో 104 మంది సీఎస్లు, 218 సీఏలు, 104 మంది మైక్రో అబ్జర్వర్లు ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగనుంది. వీరితోపాటు ఒక్కో టేబుల్ వద్ద ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉండనున్నారు. వారి సమక్షంలోనే ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. జిల్లావ్యాప్తంగా 9,60,376 ఓటర్లు ఉండగా,.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 7,46,123 ఓట్లు పోలయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి 7395 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అయితే ప్రతీ 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఒక టేబుల్ చొప్పున నాలుగు నియోజకవర్గాలకు 13 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పరిగి నియోజకవర్గంలో 2920 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 5 టేబుళ్లు, వికారాబాద్లో 1810 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకుగాను 3 టేబుళ్లు, తాండూర్లో పోలైన 1500 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకుగాను 3 టేబుళ్లు, కొడంగల్ నియోజకవర్గంలో పోలైన 1165 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకుగాను 2 టేబుళ్లను ఏర్పాటు చేశారు. నాలుగు నియోజకవర్గాల్లోని పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు పూర్తికానుంది.