ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 20: ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డు అభివృద్ధిపథంలో ముందుకు దూసుకెళ్తున్నది. ప్రతిఏటా ఆదాయ వనరులను సమకూర్చుకోవడంతోపాటు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సా రించింది. ప్రస్తుతం ఉన్న దుకాణాలతోపాటు వివిధ రూపాల్లో వస్తున్న ఆదాయం నుంచి రూ. 1.20 కోట్లు కేటాయించి కొత్తగా 17 దుకాణాల ను నిర్మిస్తున్నది. కాగా ఇప్పటికే ఈ మార్కెట్యా ర్డులో 51 మడిగెలున్నాయి. వాటి ద్వారా మా ర్కెట్ కమిటీకి ప్రతినెలా సుమారు రూ.5 లక్షల వరకు అద్దె రూపంలో ఆదాయం వస్తున్నది. అలాగే.. మార్కెట్యార్డు పరిధిలో ఉన్న రైస్మిల్లులు, గోడౌన్లు, కూరగాయల వ్యాపారుల నుంచి కూడా ప్రతినెలా రాబడి సమకూరుతున్నది.
ఇబ్రహీంపట్నం మధ్యలో సాగర్ రహదారికి పక్కన మార్కెట్యార్డు ఉండటంతో ఈ ప్రాంతంలో దుకాణాల మడిగెలకు విపరీతమైన డిమాండ్ ఉన్నది. దీనిని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ యార్డు స్థలంలో సాగర్ రహదారి పొడవునా ఇప్పటికే 51 మడిగెలను నిర్మించారు. కొత్తగా మార్కెట్ యార్డు పరిధిలోని ఆంధ్రాబ్యాంకు వెనుక వైపు నుంచి కొత్తగా 17 మడిగెల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తైతే మార్కెట్ కమిటీకి ఏటా మరో రూ.2 లక్షల వరకు ఆదాయం సమకూరనున్నది. రెండు అంతస్తుల సామర్థ్యంతో ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే ఒక అంతస్తు నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చింది.
68కి చేరనున్న దుకాణాలు
ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులో ప్రస్తుతం ఉన్న 51 దుకాణాలతోపాటు అదనంగా నిర్మిస్తున్న 17 షాపులతో వాటి సంఖ్య 68కి చేరనున్నది. ఈ షాపుల కేటాయింపుతో వచ్చే డిపాజిట్తోపాటు ప్రతినెలా వచ్చే అద్దెతో మార్కెట్ యార్డుకు ప్రత్యేక ఆదాయం సమకూరనున్నది. దాంతో మార్కెట్ యార్డులో మరిన్ని షాపులతోపాటు గోడౌన్లను నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు.
అందుబాటులో 51 దుకాణాలు..
ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డుకు ఆదాయాన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో షాపుల నిర్మాణంపై దృష్టి సారించాం. మార్కెట్ యార్డులో ఖాళీ స్థలం ఉన్నందున రూ.1.20 కోట్లతో కొత్తగా 17 షాపులను నిర్మిస్తున్నాం. ఇప్పటికే మార్కెట్ యార్డులో 51 దుకాణాలున్నాయి. వచ్చే ఆదాయంతో భవిష్యత్తులో మరిన్ని శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నాం.
-శ్రీనివాస్, మార్కెట్ కమిటీ కార్యదర్శి