పెద్దేముల్, జనవరి 3 : చెంచు జాతి ప్రజలను జీవితాల్లో వెలుగులు నింపి వారికి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ‘పీఎం జన్మన్’ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని చైతన్యనగర్లో సర్పంచ్ లలిత అధ్యక్షతన పీఎం జన్మన్ పథకం కింద చెంచు జాతి ప్రజలు పొందాల్సిన కనీస సౌకర్యాలపై చెంచు కుటుంబాలతో సమావేశాన్ని నిర్వహించారు.
పలు సూచనలు, సలహాలను చేసి, చెంచు ప్రజలకు కనీస సౌకర్యాల దృష్ట్యా అందించాల్సిన సేవలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పీఎం జన్మన్(ప్రధానమంత్రి జన్ జాతీయ ఆదివాసీ న్యాయ్ అభియాన్)లో భాగంగా జిల్లాలో దాదాపు 22 అనుబంధ గ్రామాలను గుర్తించారు. అందులో ఎక్కువ మొత్తంలో చెంచుజాతి ప్రజలు నివాసం ఉంటున్న చైతన్యనగర్లో ఈ నెల 15న పెద్దఎత్తున సదస్సును నిర్వహించి చెంచు జాతి ప్రజలకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు.
ముఖ్యంగా పీఎం జన్మన్లో 11 రకాల ముఖ్యమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అందులో ప్రతి వ్యక్తికి ఆధార్కార్డు, కులం సర్టిఫికెట్, ప్రతి కుటుంబానికి బ్యాంకు అకౌంట్, పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డు, ఇంటింటికీ కరెంట్, నల్లా కనెక్షన్, గర్భిణులకు ఆర్థిక సాయం, ఉచిత నిత్యావసర సరుకులు, ఆయుష్మాన్ భారత్, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం, అందరికీ పక్కా ఇండ్లు, ప్రతి గ్రామానికి రహదారి, కౌశల్ వికాస్, జీవనోపాధి పెరుగుదల, మెరుగైన టెలిఫోన్ సౌకర్యాల అనుసంధానత వంటి సౌకర్యాలు పొందడానికి చెంచు జాతి ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబానికి సౌకర్యాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామంలో ఆధార్కార్డు, నల్లా కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, కులం సర్టిఫికెట్, పంట రుణాలు పొందనివారు, 2005 కంటే ముందు పోడు భూములను సాగు చేస్తున్నవారు, కిసాన్ క్రెడిట్, అబా కార్డులు లేనివారి జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామంలో ఆధార్ కార్డు లేనివారి కోసం ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మార్వోను, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారిని, మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్ లేని వారికి నల్లా కనెక్షన్ను, గ్రామంలో ఎక్కడైనా లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇండ్లు, రోడ్లు, అంగన్వాడీ సెంటర్లపై వారం రోజుల్లో మరో సమావేశం ఉంటుందని, దరఖాస్తుల ప్రక్రియ బాధ్యతను స్థానికంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి చూసుకోవాలన్నారు.
రేపటి నుంచి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి 11 రకాల సౌకర్యాలను చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం గ్రామస్తులు కలెక్టర్కు పలు సమస్యలను వివరిస్తూ దరఖాస్తులను అందించారు. కార్యక్రమంలో డీటీడబ్ల్యూవో కోటాజీ, డీఏవో గోపాల్, డీఈవో రేణుకాదేవి, డీఎంఅండ్హెచ్వో పాల్వన్కుమార్, డీడబ్ల్యూవో లలితాకుమారి, ఎమ్మార్వో కిషన్, విద్యుత్ డీఈ భానుప్రసాద్, ఏడీఈ ఆదినారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఇంట్రా ఈఈ బాబు శ్రీనివాస్, లోన్ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్, పంచాయతీ కార్యదర్శి నాగరాణి, ఆర్ఐ రాజురెడ్డి, డాక్టర్ బుచ్చిబాబు, ఏఈ అఖిల్, సీడీపీవో రేణుక పాల్గొన్నారు.