ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 11 : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై బలపరీక్షకు ముహూర్తం దగ్గర పడుతున్నది. ఈనెల 16న అవిశ్వాసంపై బలపరీక్ష నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన 17 మంది క్యాంపులకు వెళ్లారు. కాగా, క్యాంపులో ఉన్న ఖానాపూర్ కౌన్సిలర్ శంకరయ్య తన అత్త మృతి చెందడంతో ఆదివారం మంచాల మండలంలోని రంగాపూర్లో జరిగిన అంత్యక్రియలకు వెళ్లారు.
విషయం తెలుసుకున్న చైర్పర్సన్ వర్గం శంకరయ్యను అక్కడి నుంచి తప్పించింది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ బలపరీక్ష ఉత్కంఠగా మారింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ బీఆర్ఎస్ నుంచి ఎంపికై గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరక ముందే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. గతంలో అవిశ్వాస తీర్మానాలపై ప్రత్యేక సమావేశాలకు కలెక్టర్ అనుమతించకపోవడంతో రెండోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
దీనిపై ఈనెల 16న ప్రత్యేక సమావేశంలో బలపరీక్ష నిర్వహించాల్సి ఉన్నది. కాగా, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఇందులో గత ఎన్నికల్లో 16 కౌన్సిలర్లు బీఆర్ఎస్, ఇద్దరు బీజేపీ, ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కప్పరి స్రవంతిని చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. చైర్పర్సన్, కౌన్సిలర్లను సంప్రదించకుండానే తీర్మానాలు చేస్తున్నారంటూ.. పలు అవినీతికి పాల్పడ్డారంటూ సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా, 15మంది బీఆర్ఎస్, ఇద్దరు బీజేపీ సభ్యులతో కలిసి 17 మంది మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆమె వెంట ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానంలో నెగ్గాలంటే అవసరమైన పూర్తి మెజార్టీ బీఆర్ఎస్కు ఉన్నది. కాగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ముగ్గురు సభ్యులు బీఆర్ఎస్లో చేరగా, బీఆర్ఎస్కు చెందిన మరో ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బలపరీక్షలో నెగ్గేందుకు బీఆర్ఎస్ పార్టీ తమ అనుకూల వర్గం కౌన్సిలర్లతో గత నెలరోజులుగా క్యాంపులకు వెళ్లిపోయింది. బలపరీక్షలో నెగ్గకుండా ఉండటం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది.
దీంతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ బలపరీక్ష రసవత్తరంగా మరే అవకాశం ఉన్నది. ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్ బలపరీక్ష సమయంలో తలెత్తిన చదురు.. మదురు సంఘటనలు దృష్టిలో ఉంచుకుని ఈ పరిస్థితి ఇబ్రహీంపట్నంలో పునరావృతం కాకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్తో పాటు ఇతరులు ఎవరు అక్కడకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్ సుదర్శన్రెడ్డిపై పెట్టిన అవిశ్వాసానికి ఈనెల 22న బలపరీక్ష ప్రవేశపెట్టడానికి ముహూర్తం ఖరారైంది. చైర్మన్ సుదర్శన్రెడ్డి, వైస్ చైర్మన్ శంకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలెక్టర్ను కలిశారు. దీనిపై ఈనెల 22న అవిశ్వాస తీర్మానంపై బలపరీక్షకు గడువు నిర్ణయించారు. కాగా, ఇప్పటికే డైరెక్టర్లు క్యాంపునకు వెళ్లారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్, అలాగే, ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసాల నేపథ్యంలో డైరెక్టర్లు, కౌన్సిలర్లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులంతా ఇరవై రోజులుగా క్యాంపుల్లో బిజీ…బిజీగా గడుపుతున్నారు.