రంగారెడ్డి, మార్చి 27(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ప్రక్రియను చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
పార్లమెంటు ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందజేయడం, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిబంధనలు, ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సిబ్బందికి మొదటి విడుత శిక్షణ కార్యక్రమంలో ఫారం -12 అందించి పోస్టల్ బ్యాలెట్పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. 85 సంవత్సరాల వయస్సు పూర్తైన వారు, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్వో సంగీత, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి కృష్ణారెడ్డి, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు పాల్గొన్నారు.