రంగారెడ్డి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని కలెక్టర్ శశాంక్ తెలిపారు. బుధవారం జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 26న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి పరిధిలోని మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోనూ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 4వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుందని, నామినేషన్లకు తుది గడువు మార్చి 11, మార్చి 12న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 14 తుది గడువు, మార్చి 28 ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెకింపు, ఏప్రిల్ 4తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.
జిల్లాలో పది మండలాలు ఆమనగల్లు, ఫరూఖ్ నగర్, కేశంపేట్, కొందర్గు, కొత్తూరు, మాడ్గుల, తలకొండపల్లి, చౌదరి గూడెం, నందిగామ, కడ్తాల్ పరిధిలో 171 మంది ఓటర్లు ఉన్నారని, షాద్నగర్లోని ఎంపీపీ కార్యాలయంలో పోలింగ్ కేంద్రం ఉంటుందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) నిబంధనలు, ఫ్లయింగ్ స్వాడ్ తదితర టీంల బాధ్యతలను కలెక్టర్ వివరించారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఎన్నికల కోడ్ వర్తిస్తుందని, కోడ్ ఉల్లంఘించకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. జిల్లాలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ టీములనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.