రంగారెడ్డి, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. పార్లమెంట్ ఎన్నికలను పురసరించుకుని సోమవారం రాజేంద్రనగర్ ఆర్వో కార్యాలయంలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు, నోడల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి బరిలో ఉండే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు.
నామినేషన్ ఫారం -2ఏను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి తీసుకోవాలన్నారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను రా జేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో సమర్పించాలన్నారు. సెలవు రోజు, ఆదివారం మినహాయింపు ఉంటుందన్నారు. ఓ అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయొచ్చని.. అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్ర మే లోనికి అనుమతిస్తారన్నారు. జాతీయ, రాష్ట్ర పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేసే నియోజకవర్గంలోని ఎవరైనా ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదిస్తే సరిపోతుందన్నారు.
అదే రిజిస్టర్డ్ పార్టీల తరఫున పోటీ చేసే వారికి, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంటుందని సూచించారు. అభ్యర్థులు ఇటీవల దిగిన ఓ పాస్పోర్టు సైజు ఫొటోను అఫిడవిట్పై.. నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు ఫొటోను అతికించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంటు సెగ్మెంట్కు చెందితే తప్పనిసరిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ ఈఆర్వో నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని సూచించారు.
రిజిస్టర్డ్, గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్-3 లో ‘సి’ కాలం ఎదురుగా ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తుల్లో ఏవైనా మూడు గుర్తులను ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేస్తూ వివరాలు పొందుపర్చాలన్నారు. అంతేకాకుండా అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు అకౌంట్ తెరవాలన్నారు. అభ్యర్థులు తమపై ఏవైనా క్రిమినల్ కేసులుంటే నామినేషన్ పత్రంలోని పార్ట్-111ఏలో వాటి వివరాలను తప్పనిసరిగా పొందుపర్చాలన్నారు. అభ్యర్థుల సహాయార్థం ఆర్వో కార్యాలయం వద్ద హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. దాఖలైన నామినేషన్లను ఈ నెల 26న పరిశీలన (స్రుట్నీ) జరుగుతుందని.. నామినేషన్ల ఉపసంహరణకు 29వ చివరి తేదీ అని తెలిపారు.
ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తుగానే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని కలెక్టర్ సూచించారు. కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు వంటివి ము ద్రించే విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 127-ఏ సూచనలు పాటించాల న్నారు. ఎన్నికల ప్రచార ప్రకటనలు, ప్రచారాంశాలు, ఎల్ఈడీ డిస్ప్లే కంటెంట్ తదితర వాటికి ఎంసీఎంసీ ద్వారా అనుమతులు తీసుకోవాలని సూచించారు.
అసెంబ్లీ నియోజ కవర్గ పరిధిలో నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, వాహనాల కోసం సంబంధిత సహాయ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వో) నుంచి అనుమతి పొందాలని.. పార్లమెంటు నియోజకవర్గ పరిధి మొత్తంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాలు, ఎల్ఈడీ వాహనాలు, హెలిప్యాడ్, హెలికాప్టర్ వంటి వాటి అనుమతులను ఆర్వో కార్యాలయం నుంచి పొందాలన్నారు. కనీసం 48 గంటల ముందు సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో సంగీత, రాజేంద్రనగర్ ఏఆర్వో వెంకటరెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.