రంగారెడ్డి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు ఫూలే నేటి తరానికి స్ఫూర్తి అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ శశాంక పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కుల వివక్షకు వ్యతిరేకంగా సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని, ఆయన దేశానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు.
వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం ఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని పేర్కొన్నారు. కుల, లింగ వివక్షకు తావు లేకుండా విద్య, సమానత్వం ద్వారానే సామాజిక, ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయనే ఫూలే ఆలోచనా విధానాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన సహచరి సావిత్రీబాయిఫూలేకు గురువుగా మారి ఉన్నత విద్యావంతురాలిగా తీర్చిదిద్దడం ద్వారా సావిత్రీబాయి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచిపోయారని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, బీసీ సంక్షేమ అధికారి విమల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వికారాబాద్ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్య కోసం పాటుపడిన జ్యోతిరావు ఫూలే అందరికీ ఆదర్శప్రాయుడని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలకు విద్యను అందించేందుకు అహర్నిశలు శ్రమించిన జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.
సామాజిక కార్యకర్త, మేధావి, కులాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, వారిలో ఆత్మ స్థైర్యం కల్పించి హక్కుల కోసం పోరాడి సాధికారతకు కృషి చేశారని పేర్కొన్నారు. తన భార్య సావిత్రీబాయి పూలేతో కలిసి భారతదేశంలో మహిళలకు విద్యను అందించేందుకు పాఠశాలలను ప్రారంభించి విద్యను సమాన హక్కుగా మహిళలకు అందించేందుకు కృషి చేశారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, బీసీడీవో ఉపేందర్, ఏవో అమరేందర్ కృష్ణ, ఏబీసీడీవో భీమరాజు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, కలెక్టరేట్, బీసీ వెల్ఫేర్ సిబ్బంది పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలకు విద్యను అందించడంలో ఫూలే చేసిన కృషిని వివరించారు. అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం, వారికి విద్యను అందించడం కోసం ఫూలే అహర్నిశలు కష్టపడ్డారన్నారు. నేటి యువతరం ఫూలే గురించి తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వీరేశ్, డీఎస్బీ ఇన్స్పెక్టర్ రాజు, ఆర్ఐ డెవిడ్, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
జ్యోతిరావుఫూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్త్రీ విద్య కోసం ఎంతో కృషి చేసిన జ్యోతిరావుఫూలే, సావిత్రీబాయిఫూలేలను మనమెప్పటికీ గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిషన్నాయక్, నాయకులున్నారు.