రంగారెడ్డి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సిందేనని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. ప్రతీక్జైన్ తన చాంబర్లో ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారితో సోమవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 10వ తేదీ నాటికే డబుల్ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి పంపిణీకి అన్ని విధాలుగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇండ్ల నిర్మాణాలతో పాటు నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజీ, అప్రోచ్ రోడ్డు లాంటి కనీస మౌలిక సదుపాయాలను సమకూర్చాలని ఆయన సూచించారు.
నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తుల సమగ్ర వివరాలను ప్రత్యేక రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సాఫీగా ఈ ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. దరఖాస్తులను తాము ప్రభుత్వ పరిశీలనకు పంపిస్తామని, అక్కడి నుంచి ఆమోదం లభించిన మీదట ఇండ్ల సంఖ్య కంటే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయాలని సూచించారు.
తుది దశలో ఉన్న మిగతా నిర్మాణాలను సైతం జనవరి 10లోపే పూర్తి చేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నందున పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు దాటకుండా పనులు పూర్తయ్యేలా ప్రతిరోజూ పర్యవేక్షణ జరపాలని పేర్కొన్నారు.